మద్దూరు (ధూళిమిట్ట), ఆగస్టు 16: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 13మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 6 నుంచి ఇంటర్ వరకు 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు. మెనూ ప్రకారం ఆదివారం ఉదయం చపాతీ, ఆలుగడ్డ కూర, మధ్యాహ్నం బగారా రైస్, చికెన్, సాయంత్రం అన్నం, ఆలుగడ్డ కూరను వడ్డించారు. రాత్రి వేళ కొందరికి ఒక్కసారిగా కండ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే పాఠశాల సిబ్బంది 13మంది విద్యార్థినులను అంబులెన్స్లో చేర్యాల సర్కార్ దవాఖానకు తరలించగా వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. చేర్యాల సీఐ రమేశ్, మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్ విద్యార్థినులను పరామర్శించారు. రాత్రి సీఐ రమేశ్ విద్యాలయాన్ని సందర్శించి, ఘటనపై ఆరా తీశారు.
తక్షణమే స్పందించిన జనగామ ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కలెక్టర్తోపాటు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏందని మండిపడ్డారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.