హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘డెడ్ డ్రాప్ గంజాయి’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలానగర్ పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటూనే ‘బొల్లా బ్రదర్స్’ గంజాయి దందాకు తెరలేపినట్టు ఈగల్ ఫోర్స్ అధికారులు రిమాండ్ రిపోర్టులో తేల్చారు. బొల్లా బ్రదర్స్ ఇంటిపై ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సమయంలో స్థానిక పీఎస్కు చెందిన కానిస్టేబుళ్లు కల్లు పార్టీ చేసుకున్నట్టు సమాచారం రావడంతో సోదాకు వెళ్లిన పోలీసులు.. వారిని మందలించి అక్కడినుంచి పంపినట్టు తెలిసింది. బొల్లా బద్రర్స్తో కలిసి పార్టీలు చేసుకొనే ఓ ఎస్సై పోలీస్ మ్యాన్ప్యాక్ (వాకీటాకీ)ని బొల్లా బ్రదర్స్ కారులో వదిలి వెళ్లినట్లు గుర్తించారు. దీనిపై సదరు ఎస్సైని సైబరాబాద్ పోలీసులు ప్రశ్నించినట్టు తెలిసింది.
రోజుకు 25సార్లు గంజాయి దందా..
క్యాటరింగ్ బాయ్స్ను సరఫరా చేసే ముసుగులో బొల్లా బ్రదర్స్ గంజాయి దందా చేస్తున్నట్టు ఈగల్ ఫోర్స్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. బొల్లా బ్రదర్స్.. రోజుకు 25 సార్లు డెడ్డ్రాప్ పద్ధతిలో గంజాయి సప్లయ్ చేస్తున్నారని పేర్కొన్నారు. నంబర్ ప్లేట్లేని బైక్ల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయి సరఫరాకు 30 మందిని నియమించుకున్నట్టు వెల్లడైంది. ఈ కేసులో ఏ1గా జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన రాజ్కుమార్, ఏ2 విజయనగరం జిల్లాకు చెం దిన బొల్లా దుర్గాప్రసాద్, ఏ3 బొల్లా కిరణ్, ఏ4 బొల్లా కమలాకర్, ఏ5గా కిరణ్కుమార్ భార్య బొల్లా హారికను చేర్చారు. నిందితుల నుంచి రూ.14 కేజీల గంజాయి, 7 వాహనాలు, 9 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.