Neeraj Chopra | పోచెఫ్స్ట్రూమ్: ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచిన భారత అమ్మాయిలపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలుకొని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే భారత జట్టుకు అభినందనలు తెలపగా.. తాజాగా ఆ జాబితాలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా చేరాడు.
దక్షిణాఫ్రికా వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి ప్రపంచకప్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్కు ముందు రోజు అండర్-19 జట్టును కలిసి విలువైన సూచనలిచ్చిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. అమ్మాయిలు వరల్డ్కప్ చేజిక్కించుకున్నాక మైదానంలో వారికి సెల్యూట్ చేశాడు. రెండు చేతులు పైకెత్తి కిందకి వంగుతూ అభివాదం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మైదానం బయట నుంచే సందడి చేస్తూ గ్రౌండ్లో అడుగుపెట్టిన నిరీజ్ ప్లేయర్లందరినీ పేరు పేరునా పలకరిస్తూ అభినందనలు తెలిపాడు. అనంతరం కెప్టెన్ షఫాలీ వర్మ.. నీరజ్ చోప్రాకు ట్రోఫీ అందించగా.. తన్మయత్వానికి గురైన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని యువ క్రీడాకారిణుల్లో స్ఫూర్తి నింపాడు.
అంతర్జాతీయ స్థాయిలో భారత సీనియర్ మహిళల జట్టు చక్కటి ప్రదర్శన చేస్తుండటం.. మహిళల కోసం ప్రత్యేకంగా ఐపీఎల్ నిర్వహిస్తుండటం.. అంచనాల్లేకుండా అండర్-19 ప్రపంచకప్ ఆడేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన అమ్మాయిలు విశ్వ విజేతలుగా నిలువడం.. దేశంలో మహిళా క్రికెట్కు శుభపరిణామమని క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ చెప్పింది. తాజా టోర్నీలో సత్తాచాటిన నలుగురైదుగురు అమ్మాయిలు సీనియర్ స్థాయిలో సత్తా చాటగల సామర్థ్యం ఉన్నవాళ్లేనని పేర్కొంది. మహిళల క్రికెట్లో భారత్కు ఏ స్థాయిలోనూ ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ కావడంతో.. ఈ ఆనందం రెండింతలైందన్న మిథాలీ.. భవిష్యత్తులో భారత్ నుంచి మరింత మంది మెరికల్లాంటి క్రీడాకారిణులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.
‘ఎక్కువ ఆప్షన్లు ఉండటం మంచిదే. అండర్-19 వరల్డ్కప్లో స్పిన్నర్లు, పేసర్లు సత్తాచాటారు. సీనియర్ స్థాయిలో పోటీ విపరీతంగా ఉన్నా.. యంగ్ ప్లేయర్లకు భవిష్యత్తులో ఈ అనుభవం పనికి వస్తుంది. వాళ్లను మరింత సానబెట్టాల్సిన అవసరం ఉంది. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన చేయడం ముఖ్యం. ఇప్పుడు అమ్మాయిల కోసం మహిళల ఐపీఎల్ అందుబాటులోకి రానుంది. దాంతో మరింత మంది వెలుగులోకి రావడం ఖాయమే. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఇప్పటి వరకు సీనియర్ స్థాయిలో భారత జట్టు ఒక్క ఐసీసీ మెగాటోర్నీని కూడా నెగ్గలేదు. ఈసారి అది సాధ్యమవుతుందని ఆశిస్తున్నా’ అని మిథాలీ చెప్పుకొచ్చింది
వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టుకు ఇప్పటికే బీసీసీఐ రూ. 5 కోట్ల నజరానా ప్రకటించగా.. బుధవారం అహ్మదాబాద్లో అమ్మాయిలను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి టీ20 సందర్భంగా అమ్మాయిలను అభినందించనున్నారు. మరోవైపు అమ్మాయిల విజయం తమలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించిందని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. త్వరలో సీనియర్ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో షఫాలీ వర్మ బృందం ఘనత తమలో స్ఫూర్తి నింపిందని పేర్కొంది.
WTC 2023 | డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో భారత్ స్థానం పదిలం.. ఆస్ట్రేలియాకు షాక్