WTC 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) ఫైనల్ లక్ష్యంగా భారత్ తొలి అడుగు వేసింది. ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో గెలిచింది. భారీ విజయంతో డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. టీమిండియా 111 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ విజయాల శాతం 61.67 ఉంది. అయితే.. టాప్లో ఉన్న ఆస్ట్రేలియా విజయాల శాతం 75.56 నుంచి 70. 83కు పడిపోయింది.
శ్రీలంక (53.33 శాతం), దక్షిణాఫ్రికా (48.72 శాతం) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఈ సారి ఫైనల్లో అడుగుపెట్టాలంటే మిగిలిన మూడు టెస్టుల్లో కనీసం రెండింటిలో గెలిచినా చాలు. జూన్లో ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసి ఫైనల్ జరగనుంది. ఈ మెగా ఫైనల్కు సంబంధించి ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానంలో ఉన్న జట్లు ఫైనల్ చేరుకుంటాయి. అయితే… ఈ పాయింట్లను ఐసీసీ ఎలా కేటాయిస్తుందో తెలుసా..? ఆయా జట్ల ప్రదర్శను బట్టి. మ్యాచ్ గెలిచిన జట్టుకు ఎన్ని పాయింట్లు వస్తాయి? డ్రా చేసుకుంటే ఎన్ని? అనేది చూద్దాం.
1. ఒక్క టెస్టు గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. విజయాల శాతం 100 ఉంటుంది.
2. ఒకవేళ మ్యాచ్ టై అయితే ఒక్కో జట్టుకు 6 పాయింట్లు లభిస్తాయి. గెలుపు శాతం 50 అని లెక్కిస్తారు.
3. మ్యాచ్ డ్రా అయితే.. ఇరు జట్లకు 4 పాయింట్లు వస్తాయి. అయితే.. విజయాల శాతం 33.33 ఉంటుంది.
4. ఓడిపోయిన జట్టుకు ఒక్క పాయింటు కూడా రాదు. విజయాల శాతాన్ని సున్నాగా పరిగణిస్తారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్లో భారత్ అదరగొట్టింది. బోర్డర్ – గవాస్కర్ తొలి టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో కంగారులను హడలెత్తించింది. రోహిత్ శర్మ సెంచరీకి తోడు జడేజా, అక్షర్ పటేల్ అర్థ శతకాలు సాధించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. రవీంద్ర జడేజా 7, అశ్విన్ 8 వికెట్లు తీసి పర్యాటక ఆసీస్ జట్టును దెబ్బతీశాడు. ఈ టెస్టులో ఆసీస్కు కలిసొచ్చింది ఏంటంటే.. ఆరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ రాణించడం. అతను 7 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టు విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.