Arunachalpradesh | అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. దీనివల్ల సంభవించిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో నలుగురు చనిపోగా, ఐదుగురు సైనికులు గల్లంతయ్యారు. ఆ రాష్ట్రంలోని అప్పర్సుబన్సిరి జిల్లాలోని కియోజరింగ్-బయాచింగ్ రోడ్డు మలుపు ప్రాంతం, దిబంగ్ లోయ జిల్లాలో ఈ ఘటనలు జరిగాయి.
దిబంగ్ లోయలో..
ఈ లోయ (Valley)లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ జిల్లాలోని పసుపానీ ఆర్మీ క్యాంపులోని రెండు షెల్టర్లు కొట్టుకుపోయాయి. ఐదో గ్రెనేడియర్కు చెందిన ఏడుగురు జవాన్లు కొట్టుకుపోయారు. ఇద్దరిని రక్షించగా, ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైనవారిని హవల్దార్ ఉపేందర్, ఆర్మీ సిబ్బంది కుందన్, వినోద్, ఆదిత్య, సముంద గా గుర్తించారు. ఐదో గ్రెనేడియర్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 58వ బెటాలియన్, జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్కు చెందిన RCC, అరుణాచల్ప్రదేశ్ పోలీసులు, వలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు.
అప్పర్సుబన్సిరిలో..
అప్పర్సుబన్సిరి ప్రాంతంలో విరిగిపడిన కొండచరియల (Landslide) శిథిలాల కింద పలువురు కూరుకుపోయారు. టాడు బాకి, తాజి రాయ్, మర్కోష్ బసుమతారి, బాబుల్ అలీ మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. నాచో పోలీస్ స్టేషన్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. దపోరిజోకు చెందిన అగ్నిమాపక, ఎమర్జెన్సీ బృందాలు, SDRF బృందం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (SDMD) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆగస్టు నెల ప్రారంభంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 మందికి పైగా మరణించారు. అంతేకాకుండా 235 రోడ్లు, 40 వంతెనలు, 75 కల్వర్టులు, 373 వాటర్ సప్లయ్ సిస్టమ్స్, 161 విద్యుత్ లైన్లు, 823 విద్యుత్ స్తంభాలు, 66 సాగునీటి ప్రాజెక్టులు, 122 ప్రభుత్వ భవనాలు, 41 స్కూళ్లు, 12 జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయని నివేదిక వెల్లడించింది.