U19 women’s worldcup | పోచెఫ్స్ట్రూమ్: యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మెగాటోర్నీలో ఎదురులేని ఆటతీరు కనబర్చిన మన అమ్మాయిలు.. ప్రతిష్ఠాత్మక వరల్డ్కప్ను ముద్దాడారు. ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్పై ఘనవిజయంతో ఫైనల్ చేరిన షఫాలీ బృందం.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ అండర్-19 బాలికల జట్టు.. 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. నలుగురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. రియానా మెక్డొనాల్డ్ (19) టాప్ స్కోర్గా నిలిచింది. మన బౌలర్లలో టిటాస్ సధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ ఆడుతూ పాడుతూ ముగించింది. టార్గెట్ పెద్దది కాకపోవడంతో ఏ మాత్రం తొందరపాటు ప్రదర్శించని యంగ్ ఇండియా 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24), సౌమ్య తివారి (24 నాటౌట్), షఫాలీ వర్మ (15) రాణించారు. ఐసీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు మెరికల్లాంటి యువ ఆటగాళ్లు పరిచయమయ్యారు. సీనియర్ స్థాయిలో ఎన్నో కీలక మ్యాచ్లు ఆడిన 19 ఏండ్ల షఫాలీ వర్మ.. తాజా టోర్నీలో బౌలర్లకు సంహస్వప్నంలా నిలిస్తే.. శ్వేతా షెరావత్ తనలోని దూకుడైన బ్యాటర్ను ప్రపంచానికి చాటింది. సౌమ్యతివారి కూడా కొన్ని కీలక ఇన్నింగ్స్లు ఆడగా.. సీనియర్ టీమ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ రాణించాల్సిన అవసరమే పెద్దగా రాలేదు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే రిచా క్రీజులోకి అడుగుపెట్టడం కంటే ముందే చాలా మ్యాచ్లు ముగిశాయి. ఇక బౌలింగ్లో పార్షవి చోప్రా, టిటాస్ సధు రూపంలో చక్కటి బౌలర్లు దొరికారు. కట్టుదిట్టమైన బంతులతో సత్తాచాటిన వీరిద్దరూ త్వరలోనే భారత జట్టులోకి రావడం ఖాయంగానే కనిపిస్తున్నది. పుట్టిన రోజు కానుకగా.. ప్రపంచకప్ కావాలన్న కెప్టెన్ షఫాలీ వర్మ కల నెరవేరింది.
దేశవాళీల్లో చక్కటి ప్రదర్శనతో ఇప్పటికే జూనియర్ మిథాలీ అనిపించుకుంటున్న తెలంగాణ యువ కెరటం.. గొంగడి త్రిష ప్రపంచకప్లో చక్కటి ప్రదర్శన కనబర్చింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. స్కాట్లాండ్తో పోరులో 57 పరుగులు చేసిన త్రిష.. ఫైనల్లో 24 పరుగులతో మెరిసింది. కీలక సమయాల్లో తన ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్తోనూ ఆకట్టుకుంది. భద్రాచలంలో పుట్టి పెరిగి.. ఆట కోసమే హైదరాబాద్కు మకాం మార్చిన త్రిష.. భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు ఆడటమే తన లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేయగా.. ఈ ప్రదర్శనతో ఆమెకు టీమ్ఇండియా నుంచి పిలుపు రావాలని ఆశిద్దాం!
Novok Djokovic | జొకోవిచ్ దస్ కా దమ్.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ కైవసం
Shefali Verma | నాకు బర్త్ డే గిఫ్ట్గా వరల్డ్ కప్ ట్రోఫీ కావాలి : షెఫాలీ వర్మ