Najibullah Zadran : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని వర్ధమాన క్రికెటర్లు ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. అంతేకాదు ధోనిని కలిసిన విదేశీ క్రికెటర్లు అతడు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తాజాగా అఫ్గానిస్థాన్ క్రికెటర్ నజీబుల్లాహ్ జద్రాన్, ధోనీ తన ఆరాధ్య ఆటగాడు అని తెలిపాడు. ధోనీ నా ఆరాధ్య ఆటగాడు. అతడిలా మరొకరు మ్యాచ్ను ముగించలేరు. అతడిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. 2015 వరల్డ్ కప్ సమయంలో ఈ వెటరన్ క్రికెటర్ తనకు చెప్పిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని వెల్లడించాడు. 2015 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఎం.ఎస్.ధోనీతో మాట్లాడాను. ‘తీవ్రమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లోనూ నువ్వు ప్రశాంతంగా ఉండు. నిన్ను నీవు నమ్ము’ అని చెప్పాడు. ఆ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నాను’ అని నజీబుల్లాహ్ చెప్పుకొచ్చాడు. అతను ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టకు ఆడుతున్నాడు.
2015 వరల్డ్ కప్లో అనేది అఫ్గానిస్థాన్కు తొలి మెగా టోర్నీ. ఆరు మ్యాచుల్లో ఒక్క విజయంతో అఫ్గానిస్థాన్ తమ గ్రూప్లో ఐదో స్థానంలో నిలిచింది. ఆ టోర్నమెంట్లో ధోనీ కెప్టెన్సీలోని భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ, తెలివిగా నిర్ణయాలు తీసుకొనే నైజం ధోనీకి అంతర్జాతీయంగా పేరు తెచ్చింది. ధోనీ సారథ్యంలో భారత్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2007 పొట్టి ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గింది.