ఫొటోను విడుదల చేసిన నక్సలైట్లు
కొత్తగూడెం క్రైం: బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో తమకు బందీగా చిక్కిన జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. సుక్మా జిల్లాలో ఓ పాత్రికేయుడికి ఫోన్ చేశారు. రాకేశ్వర్ కుమార్తె విలపిస్తూ అభ్యర్థిస్తున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, ఆయన సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. గాయపడితే ప్రాథమిక చికిత్స అందించామని చెప్పారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే తాము రాకేశ్వర్ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. నక్సలైట్లు విడుదల చేసిన రాకేశ్వర్ ఫొటో వైరల్ అయింది. అయితే ఈ ఫొటో పాతదే అని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జవాన్ను వదిలేయాల్సిందిగా నక్సలైట్లను కోరడానికి సామాజిక కార్యకర్త సోనీ సోరి ఎన్కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలోకి బుధవారం వెళ్లారు.
అతడిని విడిచిపెట్టాలి: నిర్బంధ వ్యతిరేక వేదిక
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ను విడుదలచేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జీ హరగోపాల్, కో కన్వీనర్లు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ఎం రాఘవాచారి, కే రవీందర్ బుధవారం విజ్ఞప్తిచేశారు. శాంతిచర్చల దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్