మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన విద్యార్థులు
జగదేవ్పూర్ జూన్ 8 : వాళ్లంతా వయస్సులో చిన్న వారైనప్పటికీ మిత్రుడి కుటుంబానికి తోచినంత సహాయం అందించి మానవత్వంలో మిన్న అనిపించుకున్నారు. మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కడారి కనకయ్య ఏడేండ్ల క్రితం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య అయిలమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. వారికి పదో తరగతి చదువుతున్న కొడుకు గణేశ్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ కుటుంబానికి అండగా నిలవాలని తోటి విద్యార్థులంతా కలిసి వాట్సాప్ గ్రూప్లో చర్చించుకున్నారు. వెంటనే అందరూ కలిసి మంగళవారం ఇటిక్యాలకు చేరుకొని గణేశ్ను వారి చెల్లెళ్లను పరామర్శించి రూ.12 వేల ఆర్థిక సహాయం అందజేశారు. తన హ్నేహితులంతా కలిసి ఇంటికి వచ్చి తనను ఆదుకోవడం ఎంతో మనోధైర్యాన్నిచ్చిందని గణేశ్ అన్నాడు. తన మిత్రుల సహాయాన్ని ఎప్పటికీ మరువనని తెలిపాడు. గణేశ్ కుటుంబాన్ని నాయకులు, గ్రామ పెద్దలు ఆదుకోవాలని మిత్రులు విజ్ఞప్తి చేశారు. చిన్న పిల్లలైనా పెద్ద మనసుతో ఆలోచించి తోటి విద్యార్థి కుటుంబానికి అండగా నిలవడాన్ని పలువురు అభినందించారు.