Fire Accident | రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. దాంతో పలువురు కార్మికులు కిటీకీల్లోంచి బయటకు దూకి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే, పలువురు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. సంఘటన జరిగిన సమయంలో 50 మంది వరకు సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిచ్చెనల సహాయంతో కార్మికులకు కిందకు తీసుకువచ్చారు. మంటల ధాటికి ఏసీలు ఒక్కసారిగా పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. అందరినీ సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భవనం నుంచి వ్యక్తులకు గాయాలు కాగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.