కుటుంబ భావోద్వేగాలతో ‘అనకాపల్లి’ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇందులో గొప్ప సందేశం కూడా ఉంటుందని చెప్పారు చిత్ర నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్మాతలిద్దరూ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు ఓ ముఖ్యపాత్రను కూడా పోషించా.
నేటి తరానికి ఫ్యామిలీ ఎమోషన్స్, విలువల గురించి తెలియజేస్తూ మంచి సందేశంతో ఈ సినిమా తీశాం. యాక్షన్ ఎక్కువగా కనిపిస్తున్నా..ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా కథ నడుస్తుంది. మా సొంతూరు అనకాపల్లిలోని రియల్ లొకేషన్లలో షూట్ చేశాం. ఊరి మీద మమకారంతో అదే టైటిల్ పెట్టాను.
సెన్సార్ వారు కూడా మంచి సినిమా తీశారని మెచ్చుకున్నారు’ అని అన్నారు. కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ ‘అనకాపల్లిలోని దాదాపు 75 లొకేషన్లలో షూటింగ్ జరిపాం. సహజసిద్ధమైన లొకేషన్లలో సినిమా తీయడం వల్ల కథలోని నేటివిటీ బాగా ఎలివేట్ అయింది. భవిష్యత్తులో త్రినాథరావుతో కలిసి సినీ నిర్మాణంలో కొనసాగుతాను’ అని చెప్పారు.