Assets : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ 26.34 కోట్లుగా ఆయన తెలిపారు. అదే సమయంలో తన భార్య ఆస్తుల విలువ రూ.15 కోట్లుగా పేర్కొన్నారు. దాంతో దంపతులు ఇద్దరి ఆస్తుల విలువ రూ.41 కోట్లుగా ఉన్నది.
ఇక్కడి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డింపుల్ యాదవ్ తన భర్త అఖిలేష్ యాదవ్ నుంచి రూ.54.26 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఇక అఖిలేష్ ఆస్తుల్లో రూ.9.12 కోట్లు చరాస్తులు కాగా, రూ.17.22 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. డింపుల్ యాదవ్ ఆస్తుల్లో రూ.5.1 కోట్లు చరాస్తులు కాగా, రూ.10.44 కోట్లు స్థిరాస్తులు. అదేవిధంగా తన దగ్గర రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పారు.
ఇక అఖిలేష్ యాదవ్ గత ఐదేళ్లలో తన సగటు వార్షిక ఆదాయం రూ.87 లక్షలుగా పేర్కొన్నారు. అదే సమయంలో డింపుల్ యాదవ్ సగటు వార్షిక ఆదాయం రూ.65 లక్షలుగా వెల్లడించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో డింపుల్ యాదవ్ తన సిట్టింగ్ స్థానమైన మెయిన్పురి నుంచి బరిలో దిగుతుండగా.. ఈసారి అఖిలేష్ యాదవ్ కూడా కన్నౌజ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.