Krunal Pandya : భారత జట్టు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా(Krunal Pandya) రెండోసారి తండ్రయ్యాడు. పాండ్యా భార్య పంఖురి శర్మ (Pankhuri Sharma) ఈమధ్యే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ రెండో సంతానానికి పాండ్యా దంపతులు ‘వాయు’ (Vayu) అని పేరు పెట్టారు. కృనాల్, పంఖురిలు తమ చంటిబిడ్డను ఎత్తుకున్న ఫొటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలు చూసిన వాళ్లంతా ఇద్దరికీ అభినందనలు తెలుపుతూ పోస్ట్లు పెడుతున్నారు. ఏప్రిల్ 21వ తేదీని బాబు పుట్టాడని కృనాల్ తెలిపాడు. దాంతో, ఈ ఆల్రౌండర్కు క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేశ్ కార్తిక్లు శుభాకాంక్షలు చెప్పారు.
మోడల్ అయిన పంఖుర్, కృనాల్ చాన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల మద్దతులో వీళ్లిద్దరూ 2017లో పెండ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2022లో కవిర్ అనే అబ్బాయి జన్మించాడు. ఇప్పుడు మరోసారి కృనాల్, పంఖుర్లు తల్లిదండ్రులయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్లో కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్కు ఆడుతున్నాడు. 16వ సీజన్లో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడడంతో.. కృనాల్ సారథిగా జట్టును నడిపించాడు. అతడి కెప్టెన్సీలో లక్నో ప్లే ఆఫ్స్ చేరినా.. నాకౌట్ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది.