అమరావతి : ఏపీలో నామినేషన్ల అఫిడవిట్లపై వచ్చిన అభ్యంతరాలపై ఆర్వోల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అభ్యంతరాల్లో అధికార వైసీపీకి చెందిన ప్రముఖులు ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Minister Buggana) మరోసారి పోటీ చేస్తున్నారు.
బుగ్గన సమర్పించిన అఫిడవిట్ (Affidavit) లో పూర్తి వివరాలు సమర్పించలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ( Kotla Suryaprakash Reddy) ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్ పత్రంలో కొన్ని కాలమ్స్ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వెంటనే నామినేషన్ తిరస్కరించాలని కోరారు. దీంతో బుగ్గన నామినేషన్ను ఆర్వోపెండింగ్లో పెట్టి సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని బుగ్గన తరఫు న్యాయవాదికి నోటీసు అందజేశారు. అయితే ఆర్వో వెంటనే నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు రిటర్నింగ్ అధికారి(ఆర్వో)కు ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని అఫిడవిట్లో పేర్కొనలేనందున నాని నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. వైసీపీ నాయకులు కూటమి అభ్యర్థులపై కూడా ఇలాంటి ఫిర్యాదులు పలు చోట్ల నమోదయ్యాయి.