NEET paper leak : నీట్ పేపర్ లీకేజీపై చేపట్టిన ఆందోళన సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోవడం లేదని తెలిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటిస్తామని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ సీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 20న జరిగిన ఆందోళన ఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల విద్యార్థులు, పోలీసులు పరస్పరం దాడికి దిగారు. పోలీసులు, భద్రతా బలగాలపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో పలువురు గాయపడగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు పాల్పడిన వారిపై ఢిల్లీ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆందోళనకు పాల్పడిన వారిలో పలువురిని గుర్తించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకోగా.. ఇంకొందరిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు. అనేకమందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే, ఈ దాడులకు పాల్పడిన మైనర్లపై, గతంలో క్రిమినల్ కేసులు లేనివారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బిహార్, అసోం వంటి అనేక రాష్ట్రాలు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ హోం మంత్రిత్వ శాఖ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గతంలో ఎలాంటి క్రిమినల్, నేర చరిత్ర లేని ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించింది. అలాగే, అదుపులోకి తీసుకున్న లేదా అరెస్టు చేసిన నిందితుల్ని వదిలేస్తామని కూడా ప్రకటించింది. అయితే, ముందుగా నిందితుల వివరాలు, నేర చరిత్రను సమీక్షించిన తర్వాతనే కేసులు ఎత్తివేస్తామని, వారిని విడుదల చేస్తామని చెప్పింది. ఒకవేళ గతంలో క్రిమినల్ కేసులుంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తమ నిర్ణయానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది.