గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 2: కాళేశ్వర జలాలు హల్దీవాగును చేరనున్నాయి. నీరులేక ఒట్టిపోయిన భూములు, పంటలకు ప్రాణం పోసేందుకు గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. నేడో, రేపో నాచారం వద్దనున్న హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడానికి అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. మర్కూక్ కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి సంగారెడ్డికి సాగునీటిని తరలించడానికి ఏర్పాటు చేసిన సంగారెడ్డి కాలువను మళ్లించి హల్దీవాగుకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు వర్గల్ నవోదయ పాఠశాల వద్ద సంగారెడ్డి కాలువ నుంచి చౌదరిపల్లి బంధం చెరువులోకి ప్రత్యేక కాలువను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎండల తీవ్రత పెరగడంతో పాటు బోర్ల నుంచి నీటి వాడకం పెరిగి భూగర్భజలాలు తగ్గుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ సూచనల మేరకు అధికారులు సంగారెడ్డి కాలువ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయడానికి సిద్ధం చేశారు.
ఇప్పటికే మల్లన్నసాగర్ కాలువ, కొండపోచమ్మ ప్రాజెక్టు జగదేవ్పూర్ కాలువ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేసి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. వర్గల్ మండలంతో పాటు, మెదక్ జిల్లా రైతులకు కూడా కాళేశ్వరం గోదావరి జలాలతో సాగునీటిని అందించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వారం, పదిరోజులుగా భువనగిరి సర్కిల్ ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈలు శ్రీనివాస్, వేణు, డీఈలు సత్యవాసు, కిరణ్కుమార్, కవితల పర్యవేక్షణలో నిర్మాణ సంస్థ సిబ్బంది, కార్మికులు ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు. నాచారం వద్ద నిర్మిస్తున్న చెక్డ్యాం దాదాపుగా పూర్తి కాగా, ప్రస్తుతం విడుదల చేసే జలాలు నిజాంసాగర్ వరకు వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. వర్గల్ వద్ద కాలువల వద్ద ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రం పూర్తయ్యాయని ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. హల్దీవాగులో మొత్తం 37 చెక్డ్యాంలు ఉండగా, సిద్దిపేట జిల్లాలో 9 చెక్డ్యాంలు, మెదక్ జిల్లాలో 23 చెక్డ్యాంలలో కాళేశ్వరం జలాలు నిండి నిజాంసాగర్లోని చేరుకుంటాయి. కాగా, సంగారెడ్డి కాలువ నుంచి ప్రతిరోజు 1,600ల క్యూసెక్కుల నీటిని అధికారులు తరలించనున్నారు.
నారసింహుడి చక్రస్నానానికి గోదావరి జలాలు..
హల్దీవాగులోని కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో నాచారం లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల చక్రస్నానం హల్దీవాగులోని గోదావరి జలాల్లోనే జరిగే అవకాశమున్నది. నేడో, రేపో గోదావరి జలాలను సంగారెడ్డి కాలువ నుంచి చౌదరిపల్లి బంధం చెరువులోకి విడుదల చేయనున్నారు. దీంతో బంధం చెరువుతో పాటు శాకారం ధర్మాయ చెరువు, వర్గల్ పెద్దచెరువు, అంబర్పేట ఖాన్ చెరువుల చెక్డ్యాంలు నిండి మరో నాలుగు నుంచి ఐదారు రోజుల్లో హల్దీవాగులోకి నీరు చేరుకుంటాయి. నాచగిరి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై రెండు రోజులు కాగా, ముగింపు నాటికి హల్దీవాగులోకి పుష్కలంగా నీరు చేరనున్నాయి. లక్ష్మీనారసింహుడికి హల్దీవాగులోని గోదావరి జలాల్లో చక్రస్నానానికి అవకాశం ఏర్పడనున్నది.
ఇవీ కూడా చదవండి..
భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతికి పాకిస్తాన్ ఆమోదం
12-15 ఏళ్ల వయసు వారిపై మా వ్యాక్సిన్ 100 శాతం సమర్థవంతం: ఫైజర్
డబ్ల్యూహెచ్ఓకు మొత్తం కొవిడ్ డాటా ఇచ్చాం : చైనా శాస్త్రవేత్త స్పష్టీకరణ