లాక్డౌన్లో ఇబ్బడిముబ్బడిగా గ్యాడ్జెట్స్ కొనుగోళ్లు
ఫలితంగా చిప్లకు విపరీతంగా పెరిగిన డిమాండ్
ఆ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్న తయారీ సంస్థలు
ఫోన్లు, ఫ్రిజ్లు, కార్లు, తదితరాల తయారీపై తీవ్ర ప్రభావం
ప్రస్తుత టెక్యుగంలో అన్నీ ‘స్మార్ట్’ రూపు సంతరించుకుంటున్నాయి. మొబైల్స్ మొదలుకొని వాచ్లు, ఫ్రిజ్లు, ఏసీలు, ఫ్యాన్లు.. చివరకు కార్లు కూడా ‘స్మార్ట్’ అవుతున్నాయి. వీటి తయారీకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేదా చిప్లు తప్పనిసరి. మనిషికి మెదడు ఎలాగో ఎలక్ట్రానిక్ పరికరాలకు చిప్లు అలాగ. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని చిప్ల కొరత వేధిస్తున్నది. డిమాండ్కు సరిపడా చిప్లు సరఫరా కాకపోవడంతో మొబైల్స్ నుంచి కార్ల వరకు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం పడుతున్నది. దీంతో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింటున్నది.
సియోల్, మార్చి 31: కరోనా మహమ్మారి కారణంగా అనేక దేశాలు లాక్డౌన్ విధించాయి. ఫలితంగా కోట్లాది మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులే దిక్కు కావడంతో కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు, ట్యాబ్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. అలాగే గేమింగ్ పరికరాలు, ఏసీలు వంటి ఉపకరణాల వినియోగం కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. ఫలితంగా వీటి తయారీకి అవసరమైన చిప్లను ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ, ఈ అనూహ్యమైన డిమాండ్ను తట్టుకునే సామర్థ్యం చిప్ తయారీసంస్థలకు లేకపోవటంతో.. చిప్లకు కొరత ఏర్పడింది. దీనివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. చిప్ ఆర్డర్కు-డెలివరీకి మధ్య సమయం తొలిసారిగా 15 వారాలకుపైగా పెరిగిందని సస్క్యూహెన్నా ఫైనాన్సియల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది.
చిప్ల ఉత్పత్తికి దేశాల మధ్య పోటీ
ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ కంపెనీల్లో రెండు ఆసియాలో ఉన్నాయి. ఒకటి తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎంఎస్సీ) కాగా, రెండోది దక్షిణకొరియాకు చెందిన శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ప్రపంచ చిప్ మార్కెట్లో దాదాపు 70 శాతం వాటా ఈ రెండింటిదే. అయితే లాక్డౌన్ సమయంలో చిప్లకు ఇంత భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతుందని ఈ కంపెనీలు ఊహించలేకపోయాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని భారీగా పెంచేందుకు రెండు సంస్థలు సిద్ధమవుతున్నాయి. 2021లో టీఎంఎస్సీ 28 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నది. మరోవైపు, శాంసంగ్ వచ్చే పదేండ్లలో ఏకంగా 116 బిలియన్ డాలర్లు ఖర్చుచేయనున్నది. అగ్రదేశాలు సైతం చిప్ల తయారీపై పోటీపడుతున్నాయి. దేశీయ చిప్ రంగంలో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అమెరికా సైతం తమ దేశంలో ప్లాంట్లు నెలకొల్పేలా చిప్ తయారీ సంస్థలను ఆహ్వానిస్తున్నది. ఇప్పటికే 12 బిలియన్ డాలర్లతో అరిజోనాలో ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు టీఎంఎస్సీ ముందుకొచ్చింది. 2024లో ఇది ఉత్పత్తి ప్రారంభించనున్నది. చిప్ల కోసం ఆసియా, అమెరికాపై ఆధారపడకుండా యూరప్లోనే ఒక సెమీకండక్టర్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) భావిస్తున్నది. టీఎంఎస్సీ, శాంసంగ్ సాయంతో దీన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నది.
స్మార్ట్కార్లు
ప్రస్తుతం కార్లు కూడా స్మార్ట్గా మారుతున్నాయి. కారు తయారీ వ్యయంలో ఎలక్ట్రానిక్స్ పరికరాలపై వెచ్చించే మొత్తం క్రమంగా పెరుగుతున్నది.
2000 18%
2010 27%
2020 40%
2030 45% (అంచనా)
చిప్ తయారీ కంపెనీలు.. వాటి వాటా
ఇవి కూడా చదవండి:
వాటర్గేట్ కుంభకోణం సూత్రధారి మృతి