చేర్యాల: అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొమురవెళ్లి మండల కేంద్రానికి చెందిన కడమంచి యాదగిరి అనే వ్యక్తి అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేశాడని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 7 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విచారించగా చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లోని పలు గ్రామాల్లో తిరిగి ప్రజల నుంచి తక్కువ ధరకు కొని సిద్దిపేట, కామారెడ్డి పట్టణాల్లోని రైస్మిల్లుల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిస్తే 79011 00100 నంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది శివకుమార్, నర్సింలు, నవీన్, రాము, అశోక్, అమృత్, సాయి పాల్గొన్నారు.