సిద్దిపేట అర్బన్ : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజారాధకృష్ణశర్మ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాంచార్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో డీఈవో రవికాంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభోదన మెరుగ్గా ఉందని అన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లోని అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని వెల్లడించారు.
స్థానిక ప్రజాప్రతినిధుల పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదివిపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా డీఈవో రవికాంతరావు మాట్లాడుతూ.. పాఠశాలకు అన్ని వసతులు సమకూర్చుకోవడం పట్ల ఉపాధ్యాయులను, గ్రామస్తులను అభినందించారు. పాఠశాలలో డిజిటల్ క్లాస్రూం ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు.
అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన దాతలను,ప్రజాప్రతినిధులను, అధికారులను, ఉపాధ్యాయ బృందం సన్మానించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి రమేశ్, మండల విద్యాధికారి యాదవరెడ్డి, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల్రంగం, గ్రామ సర్పంచ్ కల్పనానర్సింలు, ఎంపీటీసీ బోనాల రంగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, మాజీ ఎంపీటీసీ బబ్బురి భిక్షపతి, భాస్కర్, ఉపాధ్యాయులు రవి, రవీందర్, మల్లిఖార్జున్రెడ్డి, దేవరాజు, విమల పలువురు పాల్గొన్నారు.