తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,10,141 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు. ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి.
భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల్లోనూ కరోనా కేసులు తగ్గడంతో విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. నిన్న (6వ తేదీ) లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబాద్ చేరుకుంది. ఈవాళ తిరిగి ఉదయం సుమారు 07.15 గంటలకు 121 మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరి వెళ్లింది.
గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కాంగ్రెస్ జెండా అందుకోవడం ద్వారా రేవంత్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రేవంత్రెడ్డి పెద్దమ్మతల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడినుంచి ర్యాలీగా గాంధీభవన్కు చేరుకున్నారు.
పల్లె ప్రగతి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు పడింది. పల్లె, పట్టణ ప్రగతి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆరుగురు గ్రామ కార్యదర్శులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. నలుగురు సర్పంచులకు షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై మరో కేసు నమోదయ్యింది. హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో భార్గవ్రామ్తోపాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిపై నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ కేసు నమోదయింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా నకిలీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు సతీవియోగం కలిగింది. ఆయన భార్య శోభారాణి కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.
వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం తన క్యాబినెట్ను విస్తరించారు. ఏడుగురు సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారు. వారిలో హై ప్రొఫైల్ మంత్రులు నలుగురు ఉన్నారు. కొత్తగా 36 మంది మోదీ క్యాబినెట్లో మంత్రులుగా చేరారు. కరోనా రెండో వేవ్ను ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తన క్యాబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేశారు.
కృష్ణానది జలాల నీటి వినియోగం వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జలశక్తి, కేఆర్ఎంబీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావట్లేదన్నారు. నీటి వినియోగాన్ని వెంటనే ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.
పెరిగిపోతున్న ఇంధన ధరలను అరికట్టడంలో, వ్యాక్సిన్ కొరత నివారించడంలో మోదీ సర్కార్ విఫలమైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధాని మోదీ ”మన్ కీ బాత్”కు బదులుగా ”పెట్రోల్ అండ్ వ్యాక్సిన్ కీ బాత్” చేయాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డివిరిచి, సొంత జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
సినిమాలు నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచామని కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అనేక హాలీవుడ్ చిత్రాలు తమ విఎఫ్ఎక్స్ యానిమేషన్ను భారతదేశంలో పూర్తి చేసుకుంటున్నాయని,చలనచిత్ర రంగంలో భారతదేశ పాత్ర పెరుగుతున్నదని జవదేకర్ అన్నారు. మరిన్ని చిత్రాలను భారతదేశంలో నిర్మించేలా చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదని పేర్కొన్నారు.
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ భౌతిక కాయానికి సాయంత్రం ముంబైలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దిలీప్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు, దర్శక నిర్మాతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శివగిరి మఠమ్ మాజీ పీఠాధిపతి,శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ (ఎస్ఎన్డిఎస్టి) మాజీ అధ్యక్షుడు,స్వామి ప్రకాశానంద బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 ఏండ్లు. వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురం జిల్లా లోని శ్రీ నారాయణ మిషన్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.
సైనిక నిర్బంధంలో ఉన్న మయన్మార్ నేత అంగ్సాన్ సూకీ (76) కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని ఆమె న్యాయవాది మిన్మిన్ సో వెల్లడించారు. సూకీ సహా ఆమె సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చారని తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం(67) హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె హత్యకు గురైంది. ఇంట్లో ధోబీగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.