న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం(67) హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె హత్యకు గురైంది. ఇంట్లో ధోబీగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో నిందితుడు రాజు, కిట్టి కుమారమంగళం ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ కొట్టగా పనిమనిషి తలుపు తీసింది. వెంటనే ఆమెపై మత్తుమందు చల్లి ఓ గదిలో పడేశాడు. మరో ఇద్దరు యువకులు కిట్టి కుమారమంగళం గదిలోకి వెళ్లి ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. రెండు గంటల తర్వాత పనిమనిషికి మెలకువ వచ్చి చూడగా కిట్టి కుమారమంగళం అచేతనంగా పడిఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చుడగా అప్పటికే ఆమె చనిపోయింది.
పనిమనిషి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ధోబి రాజును అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. డబ్బు, బంగారం కోసమే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావించారు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి హయాంలో(1998-2001) పి. రంగరాజన్ కుమారమంగళం కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.