వట్పల్లి, జూన్ 19: రైతులు ఒకే రకం పంటలు వేయకుండా, పంట మార్పిడి చేయడంతో పాటు మంచి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లిలో ‘వరము’ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పంటలకు మంచి మద్దతు ధర చెల్లించి, కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. కొనుగొళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని..అధికారులు టోకెన్లు అందజేసిన రైతులుతప్ప వ్యాపారులెవరైనా జొన్నలు తీసుకువస్తే కొనకూడదన్నారు. రైతులకు క్వింటాలు జొన్నలకు రూ.2620 ప్రభుత్వ మద్దతు ధర చెల్లిస్తున్నదని తెలిపారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను మునిపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రజినీకాంత్, రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, వరము చైర్మన్ వీరారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వినోద్గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు అశోక్గౌడ్, ఎంపీపీలు కృష్ణవేణి, శైలజ, బాలయ్య, రాయికోడ్ జడ్పీటీసీ మల్లికార్జున్, తాలెల్మ ఎత్తిపోతల చైర్మన్ లింగాగౌడ్, జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏడీఏ హరిత, ఏవో మహేశ్చౌహన్, స్థానిక సర్పంచ్ సురేఖ, ఎంపీటీసీ ఇందిరరాజేందర్ పాల్గొన్నారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టడంతో పాటు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పెరిగేలా చూడాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లిలో మండల ప్రత్యేక అధికారి పిరంగి, ఎంపీడీవో గీత, ఎంపీవో యూస్ఫ్, అధికారులతో కలిసి సర్పంచ్లు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెప్రగతి పనులు త్వరగా పూర్తిచేసి పల్లెలో పచ్చదనం ఉట్టిపడాలన్నారు. అధికారులు ఎప్పట్టికప్పుడూ గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించాలన్నారు. కొన్ని గ్రామాల సర్పంచ్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో వట్పల్లి, రేగోడ్ తదితర మండలాల రైతుల భూములు సస్యశ్యామలం కానున్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభంకానున్నాయని… కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా భూములన్నీ పచ్చని పంటలతో దర్శనమివ్వనున్నాయన్నారు.
పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని, ఈ విషయంలో గ్రామ సర్పంచ్లు, కార్యదర్శులు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పుల్కల్ మండల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రతకు సహకరించే గ్రామానికి ఉత్తమ అవార్డులు అందజేస్తాన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధులత, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సర్పంచులు ఉన్నారు.