పాజిటివిటీ రేట్ తగ్గి కరోనా నియంత్రణలోకి రావడంతో నేటి నుంచి అన్లాక్ అమలుకు ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆదివారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా తొలగనున్నాయి. దీంతో జిల్లాలో సాధారణ స్థితి నెలకొననుంది. దుకాణాలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, రెస్టారెంట్లు పూర్తిగా తెరుచుకోనున్నాయి. రవాణా సౌకర్యాలు పూర్తిగా పునరుద్ధరిస్తారు. జూలై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.
-సంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/మెదక్
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ ఆంక్షలు తొలిగి సాధారణ స్థితి నెలకొననున్నది. ఆదివారం నుంచి దుకాణాలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు, రెస్టారెంట్లు పూర్తిగా తెరుచుకోనున్నాయి. అలాగే రవాణా సౌకర్యాలు పునరుద్ధరిస్తారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజాజీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినొద్దన్న ఉద్దేశంతో ప్రభు త్వం లాక్డౌన్ నిబంధనలను తొలగించింది. లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయంతో అన్నివర్గాల వ్యాపారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. ఇదిలా ఉంటే జూలై ఒకటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేసినప్పటికీ కరోనా ముప్పు ఇంకా ఉన్నందున ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. కరో నా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని జిల్లా అధికారులు చెబుతున్నారు. శనివారం సమావేశమైన రాష్ట్ర కేబినేట్ విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1714, మోడ ల్ స్కూళ్లు, 10, ఆశ్రమ పాఠశాలలు నాలుగు, గురుకుల పాఠశాలలు 19, కేజీవీబీలు 17, జూనియర్ కాలేజీలు 105 ఉన్నాయి.
సిద్దిపేట జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 1046 ఉన్నాయి. అందులో జిల్లా పరిషత్ పాఠశాలలు 227 ఉండగా, ప్రాథమిక పాఠశాలలు 636, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు 113 ఉన్నాయి. 14 మోడల్ స్కూళ్లు, 22 ఆదర్శ పాఠశాలలు, 16 సోషల్ వెల్ఫేర్, 10 బీసీ వెల్ఫేర్, 6 మైనార్టీ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి.
మెదక్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 923 ఉన్నాయి. కేజీబీవీలు 15, ఆదర్శ పాఠశాలలు 7, బీసీ వెల్ఫేర్ (జ్యోతిబాపూలే) 7, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 4, ట్రైబల్ వెల్ఫేర్ 5, మినీ గురుకులాలు 2, మైనార్టీ గురుకుల పాఠశాలలు 2, ఆశ్రమ పాఠశాలలు 2 ఉన్నాయి. జూలై 1నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండడంతో బోధనా సిబ్బంది, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనాను అదుపులోకి తీసుకు వచ్చేందుకు గత నెల 12 నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నది. శనివారం వరకు జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలను అమలులో ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కరోనా అదుపులోకి వచ్చింది. లాక్డౌన్ అమలుకు ముందు సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు 18.52 శాతం నమోదైంది. లాక్డౌన్ అమలుకు ముందు జూన్ 11న జిల్లాలో 1401 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 17.41 శాతంగా నమోదైంది. జూన్ 12 నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చింది. లాక్డౌన్ అమలుతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయటంతో కరోనా పాజిటివిటీ రేటు 17.41 శాతం నుంచి క్రమంగా 2శాతానికి తగ్గుతూ వచ్చింది. కాగా , శనివారం సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు 1.65 శాతంగా నమోదైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం మేరకు శనివారం సంగారెడ్డి జిల్లాలో 1492 కరోనా పరీక్షలు నిర్వహించగా, 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారుల గణాంకాల మేరకు శనివారం కరోనా పాజిటివ్ రేటు 1.65 శాతం నమోదైంది.