Tech Tips | సాంకేతికత రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రతి ఉద్యోగీ కంప్యూటర్లతో దోస్తీచేయాల్సి వస్తున్నది. ఎనిమిదేసి గంటలు స్క్రీన్కు కండ్లు అప్పగిస్తే కానీ బాధ్యత పూర్తవ్వదు. ఇక స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు సరేసరి! నిమిషానికోసారి ఫోన్లోకి తొంగి చూడకపోతే మనసు ఆగదు. రెండు నిమిషాలకో నోటిఫికేషన్ వస్తే గానీ తృప్తి కలగదు. డిజిటల్ క్రమశిక్షణ లోపించడమే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు నిపుణులు. దీనిని అధిగమించడానికి ఆయా సంస్థల యాజమాన్యాలు పలు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. సైబర్ ప్రపంచంలో ఉద్యోగి సురక్షితంగా ఉంటేనే.. కంపెనీ వివరాలు కూడా భద్రంగా ఉంటాయి. ఎక్కడ తేడా వచ్చినా.. ఆన్లైన్ నేరగాళ్లు విజృంభిస్తారు.
మాడ్రన్ క్యాబిన్లో కూర్చున్నా, సెంట్రల్ ఏసీలో చెమట చిందకుండా పనిచేస్తున్నా.. డిజిటల్ ఉద్యోగుల్లో శారీరక శ్రమతోపాటు, మానసిక ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోతున్నది. పొద్దంతా టెక్నికల్ టూల్స్తో పనిచేసే ఉద్యోగులు సాయంత్రానికి డస్సిపోతుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిరంతరం సాంకేతిక వీధిలో విహరించే వీరిని కబళించడానికి సైబర్ నేరగాళ్లు కాచుకుని ఉంటారు. ఈ-కామర్స్, క్రిప్టో కరెన్సీ, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ తరచూ కవ్విస్తుంటాయి. కాస్త అత్యుత్సాహవంతులను అదును చూసి దెబ్బతీసేందుకు ఆరితేరిన స్కామర్లు వలపన్ని సిద్ధంగా ఉంటారు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొట్టి కొంప ముంచేస్తారు. ఇలాంటి ప్రమాదాలబారిన పడకుండా ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదే! ఇంటర్నెట్లో ఎలా వ్యవహరించాలి, సామాజిక మాధ్యమాల్లో ఏ మేరకు చురుగ్గా ఉండాలి తదితర అంశాలపై అవగాహన కల్పించడం చాలా అవసరం.
అవగాహన ముఖ్యం: ఉద్యోగులకు డిజిటల్ క్రమశిక్షణపై అవగాహన తరగతులు చెప్పించాలి. సాంకేతిక అభిరుచులు ఎలా ఉండాలి? ఎంతవరకు ఫోన్ వాడాలి? సమయపాలన తదితర విషయాలను వివరించాలి.
తగ్గిస్తే మంచిది: ఒకవైపు కంప్యూటర్తో పనిచేస్తూనే, మరోవైపు ఫోన్తో దోస్తీ చేస్తుంటారు. ఫలితంగా డిజిటల్ వాడకం మరింత పెరుగుతుంది. పనివేళల్లో ఇతర డిజిటల్ డివైజ్ల వినియోగం తగ్గించడం మంచిది.
విరామాలు: డిజిటల్ ప్లాట్ఫామ్పై పనిచేస్తున్న ఉద్యోగులు రెండు గంటలకు కనీసం పది నిమిషాలైనా విరామం తీసుకోవడం అవసరం. ఆ సమయంలో ఫోన్ చూడకుండా, ఆన్లైన్ చాటింగ్ చేయకుండా ఆఫీస్లోనే నాలుగు అడుగులు వేయడం మంచిది. అలా ఉద్యోగులకు విరామం కల్పించే దిశగా సంస్థలు తగిన చర్యలు
తీసుకోవాలి.
హితం కోరి: ఉద్యోగులకు పనివేళల ఒత్తిడి లేకుండా స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ముఖ్యం. రిమోట్వర్క్కు అనుమతివ్వడం, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ వేయడం వంటివి ఉద్యోగులపై డిజిటల్ ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తాయి.
డిజిటల్ డిటాక్స్: అడపాదడపా ఉద్యోగులు ఒకరోజంతా కంప్యూటర్కు, ఫోన్కు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఏ విహారానికో వెళ్లమని ప్రోత్సహించాలి.
ఆదర్శంగా..: ఇలా ఉండాలి, అలా చేయకూడదు అని చెప్పడమే కాదు… మేనేజర్లు, టీమ్ లీడర్లు కూడా ఫోన్ వాడకం తగ్గించి ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాలి.
రిమోట్, హైబ్రిడ్ వర్క్ను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగులను సాంకేతిక ఉచ్చులోంచి బయటపడేసే వీలు కలుగుతుంది. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని ప్రోత్సహించడం అవసరం. అంతేకాదు, కంప్యూటర్పై ఎక్కువగా సమయం గడుపుతున్న ఉద్యోగులను గుర్తించి వారికి ఇలాంటి వెసులుబాటు కల్పించడం ముఖ్యం. డిజిటల్ డిటాక్స్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, మెసేజింగ్, డిజిటల్ పేరెంటింగ్ తదితర అంశాలపై అవగాహన పొందేలా నిపుణులతో చర్చావేదికలు నిర్వహించాలి. ఇవన్నీ చేయగలిగితే.. సాంకేతిక ప్రపంచంలో పనిచేస్తున్న ఉద్యోగులు దానివల్ల కలిగే దుష్ప్రభావాలకు లోనుకాకుండా ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరికి వారే స్వీయనియంత్రణ కలిగి ఉండాలని మర్చిపోవద్దు.
☛ ముందస్తు ప్రణాళికలు ఇవ్వడం ద్వారా పని సులభతరం అవుతుంది.
☛ డిజిటల్ సాధనాలను సమర్థంగా వినియోగించేలా అవగాహన కల్పించాలి.
☛ సమయపాలన పాటించేలా చూసుకోవాలి.
☛ డిజిటల్ డిటాక్స్ కోసం విహారయాత్రలకు వెళ్లే అవకాశం కల్పించాలి.
☛ పనివేళల్లో రెండు గంటలకు ఒకసారి పది నిమిషాలు విరామం ఇవ్వాలి.
☛రెండు నెలలకు ఒకసారి ఆక్యుపంక్చర్ సెషన్స్ నిర్వహించాలి. యోగా, ఇతర వ్యాయామాలకు సంబంధించిన సెషన్స్ ఏర్పాటుచేయాలి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్నౌ ఫౌండేషన్
Cinema Review | సినిమా రివ్యూలు ఇవ్వండి.. డబ్బులు ఇస్తామని మెసేజ్లు వస్తున్నాయా?
Tech Tips | సోషల్మీడియాలో మీ పిక్ పెడుతున్నారా? ఇలా చేస్తే బుక్కయినట్టే!
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి