సంగారెడ్డి, జూలై 30: గ్రామ పంచాయతీలలో పారిశుధ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాల్లో పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ఎల్లయ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని మెడ్వాన్ కార్యాలయంలో యునిసెఫ్, తెలంగాణ అలెయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్, మంజీరా రూరల్ డెవలఫ్మెంట్ సొసైటీల సంయుక్త సహకారంతో మెడ్వాన్ ఆధ్వర్యంలో ‘పంచాయతీల పాత్ర’ పై సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ కొవిడ్ బారిన పడకుండా పారిశుధ్య కార్యక్రమాల్లో గ్రామస్తులను భాగస్వామ్యం చేసి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో బాలల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేసేవారని, వాటికి సర్పంచ్లే చైర్మన్లుగా ఉంటారని, ప్రతినెల సమావేశమై గ్రామంలో ఉన్న పిల్లల సమస్యలపై చర్చించి బాల్యవివాహాలు, అక్రమరవాణా, భిక్షాటన చేసే పిల్లలు, దత్తత, బాలకార్మిక సమస్యలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా బాలల రక్షణ అధికారి రత్నం, మంజీరా రూరల్ డెవలఫ్మెంట్ సొసైటీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి వెంకటేశం, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు వెంకటేశం, చైల్డ్లైన్ కో-ఆర్డినేటర్ ముజీబ్, మెడ్వాన్ కో- ఆర్డినేటర్ స్వప్న, రిసోర్స్ పర్సన్ సోమనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.