సంగారెడ్డి, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు వేడెక్కుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు దిగ్గజ నేతలు కదన రంగంలోకి దిగుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అడుగుపెడుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈనెల 30న ప్రధాన నరేంద్రమోదీ పర్యటించనున్నారు. వచ్చేవారం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇది వరకే సంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేశారు. ఇటీవల అందోలు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ లక్ష మందితో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు. వచ్చేనెల మరోసారి కేసీఆర్ సంగారెడ్డిలో నిర్వహించే బస్సుయాత్రలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండడంతో పార్లమెంట్ ఎన్నికల వేడెక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాన పార్టీల అగ్రనేతలు ఏమి మాట్లాడతారు, ఎలాంటి హామీలు ఇస్తారు అని పార్టీల కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగడంతో వారి సభలు, ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర, జిల్లా నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్లో ఈనెల 30న నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు రఘునందన్రావు(మెదక్), బీబీ పాటిల్(జహీరాబాద్) పక్షాన ఎన్నికల ప్రచారం చేసేందుకు 30న మోదీ రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గంలో 30న మోదీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. ఈ సభకు సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు పటాన్చెరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు రానున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటుండడంతో కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంపై దృష్టిపెట్టింది. వచ్చేవారం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రానున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు నీలం మధు(మెదక్), సురేశ్ షెట్కార్(జహీరాబాద్) గెలుపు కోసం త్వరలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఈ సభకు రాహుల్ గాంధీ రానున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. త్వరలో సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సైతం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచా రం చేయనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దీంతో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల సుల్తాన్పూర్లో లక్ష మందితో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎవ్వరూ ఊహించని విధంగా కేసీఆర్ బహిరంగ సభ విజయవంతమైంది. దీంతో కేసీఆర్ సభ తరహాలో ఇతర పార్టీలు బహిరంగ సభలు నిర్వహించేందుకు పూనుకుంటున్నాయి. కేసీఆర్ మరోసారి జిల్లాలో ప్రచారానికి వస్తున్నారు. మే 8న పటాన్చెరులో కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టనున్నారు. గుమ్మడిదల, జిన్నారం, అమీన్పూర్, పటాన్చెరు మండలాల్లో బస్సుయాత్ర సాగనున్నది. పటాన్చెరులో కేసీఆర్ ఎన్నికల సభ ఉంటుంది. కేసీఆర్ బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ తరఫున విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్కుమార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జిల్లా, నియోకజవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.