– పుస్తక పఠనంతో పరిపూర్ణ విజ్ఞానం
– సీనియర్ గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డా. ఆనందం దుర్గా ప్రసాద్
– నల్లగొండ ఎన్జీ కళాశాలలో ఘనంగా జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం
రామగిరి, ఆగస్టు 14 : పుస్తక పఠనంతోనే పరిపూర్ణ విజ్ఞానం లభిస్తుందని హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకుడు డా.ఆనందం దుర్గా ప్రసాద్ అన్నారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో భారత గ్రంథాలయ పితామహుడు డా.ఎస్.ఆర్.రంగనాథన్ 134వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనందం దుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా.ఎస్.ఆర్.రంగనాథన్ గ్రంథాలయ రంగంలో ప్రవేశపెట్టిన ‘ఐదు సూత్రాలు’ సమాజానికి అత్యంత విలువైనవని ఆయన కొనియాడారు. నేటి డిజిటల్ యుగంలోనూ విద్యార్థులకు గ్రంథాలయాలే అసలైన విజ్ఞాన భాండాగారాలన్నారు. కళాశాలలోని గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, రాబోయే అన్ని పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల గ్రంథాలయానికి గత కొన్నేళ్లుగా పూర్తి స్థాయి గ్రంథపాలకుడు లేని విషయాన్ని ప్రస్తావిస్తూ, త్వరలోనే రెగ్యులర్ లైబ్రరియన్ నియామకం కోసం పై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డా.డి.మునిస్వామి, వివిధ విభాగాల అధ్యాపకులు డా.అనిల్ అబ్రహం, డా.సి.జ్యోత్స్న, డా.ఆదే మల్లేశం, వెంకట్ రెడ్డి, అలాగే గ్రంథాలయ సిబ్బంది శ్రీరాములు, భరణి, రేణుక పాల్గొన్నారు.

‘గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు’