నిజాంపేట, ఏప్రిల్ 26: ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను సరిగ్గా అమలు చేయకుండా ప్రజలకు మొండిచేయి చూపుతున్నదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శుక్రవారం నిజాంపేటలో నూతన బస్టాప్ నుంచి గాంధీచౌక్ వరకు నిర్వహించిన రోడ్ షోలో రఘునందన్రావు పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 9న రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన రేవంత్రెడ్డి ఆ హామీని నెరవేర్చలేదన్నారు. మళ్లీ రైతులను మోసం చేసే దిశగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో ఎటువంటి స్పష్టత లేదని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా రూ.4 వేల పింఛన్లు, మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వడం లేదన్నారు.
సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చారన్నారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని బీజేపీ అభ్యర్థి రఘునందన్ ప్రజలను కోరారు. అనంతరం జడ్పీటీసీ క్యాంపు కార్యాలయంలో ఇతర పార్టీలకు చెందిన 30మంది కార్యకర్తలకు ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచ్ సంజీవ్, నాయకులు తిరుపతి, శ్రీనివాస్, మహంకాళి, శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్, జాల పోచయ్య, స్వామి, రాజిరెడ్డి, ఎల్లం, రమేశ్, శంకర్, రాజు ఉన్నారు.