Sarangapur | సారంగాపూర్: అన్ని వర్గాలకు పింఛన్లు (Penstion) ఇస్తాం. సంక్షేమ పథకాలను అర్హులైన వారందకి అమలు చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పట్టించుకోవడం లేదని జడ్పీ మాజీ చైర్మెన్ దావ వసంత సురేశ్ ఆరోపించారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పుడేమో వితంతువు, ఒంటరి మహిళ, చేనేత, గీత, డయాలసిస్, ఫైలేరియా బాధితులకు అని ప్రటించింది. కానీ బీడీ కార్మికులు, వృద్ధులు, మహిళలకు అవకాశం లేకుండా చేసి వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లను రూ. 2,018కు పెంచిన ఘనత కేసీఆర్దే అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పింఛన్ నగదు నాలుగు వేలు చేస్తామని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు నెలా నెలా నగదు ఇస్తామని చెప్పి రెండున్నర ఏండ్లు దాటినా అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. ప్రజాపాలన గ్రామసభల్లో వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు పింఛన్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం విడ్డురంగా ఉందని మండిపడ్డారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఆ దరఖాస్తులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.
ఇప్పటికి నాలుగుసార్లు దరఖాస్తుల (Applications) కోసం పేదలకు కాగితాల ఖర్చే తప్ప వచ్చింది ఏమీ లేదని వాపోయారు. ఆగస్టు 31 వరకు పింఛన్లు ఇస్తామని చెప్పుతున్న ప్రభుత్వం బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తానని చెప్పి ప్రభుత్వం మొండిచేయి చూపించిందని దుయ్యబట్టారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు సీఎం, మంత్రులు అందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్యాక్స్ మాజీ చైర్మన్ సాగి సత్యం రావు, నాయకులు కొండ్ర రాంచందర్ రెడ్డి, ఓడ్నాల జగన్, సాతాల్ల రమేశ్, శ్రీనివాస్, బందెల రమేశ్, బేర మహేశ్, బుచ్చిరెడ్డి, పడిగెల గంగారెడ్డి పాల్గొన్నారు.