నీలగిరి, ఆగస్టు 14 : మహిళలు, బాలికలు, చిన్నారులు లైంగిక హింసకు గురైన సందర్భాల్లో వారికి అండగా నిలుస్తూ పోలీస్, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే వేదిక ద్వారా అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి, కేంద్రం ద్వారా బాధితులకు అందిస్తున్న వివిధ సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు సత్వర సహాయం అందించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ భరోసా కల్పించాలని సిబ్బందికి సూచించారు. బాధితులు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తెలియజేసే విధంగా సానుకూలమైన, నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు.
బాధిత మహిళలు, బాలికలు, చిన్నారుల పట్ల సానుభూతి, గోప్యత, గౌరవంతో వ్యవహరిస్తూ వారికి అవసరమైన పోలీస్, వైద్య, న్యాయ, మానసిక సహాయాన్ని సత్వరమే అందించాలని సూచించారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో బాధిత చిన్నారుల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని చైల్డ్ ఫ్రెండ్లీ విధానంలో విచారణ, కౌన్సెలింగ్ ఇతర సహాయ సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా సంబంధిత పోలీస్ అధికారులు, వైద్య, న్యాయ మరియు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా కేంద్రం ఇన్చార్జ్ ఎస్ఐ అమ్రీన్, ఎస్ఐ గౌస్, ఏఎస్ఐ అబేదా, శ్రీనివాస్, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ నళిని,సిబ్బంది, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.