హుస్నాబాద్, ఏప్రిల్ 26: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని, ఎన్ని అబద్ధాలు చెప్పినా వినే స్థితిలో ప్రజలు లేరని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడలో కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ రోడ్ల మీద ఫొటోలు పెట్టి ఓట్లు అడుగుతున్న బీజేపీని ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవనివ్వరని, హిందువుల ఆస్తులను ముస్లింలకు అప్పగిస్తారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గ్రామా ల్లో పర్యటించిన దాఖలాలు లేవన్నారు. గ్రామాల్లోని సమస్యలు ఆయనకు పట్టవన్నారు. కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.