సంగారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్, ఆర్టీపీసీఆర్ సెంటర్ బుధవారం ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు వీటిని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టీ-హబ్ ప్రారంభంతో బుధవారం నుంచి జిల్లా కేంద్ర దవాఖానతోపాటు పీహెచ్సీలకు వచ్చే రోగులకు 57 రకాల ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. అలాగే, కరోనా నిర్ధారణ కోసం ప్రభుత్వం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ప్రిక్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్)సెంటర్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కొత్తగా రూ.2.50 కోట్లతో డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. రూ.50 లక్షలతో భవనం నిర్మించారు. అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు చేసేందుకు రూ.2 కోట్లతో పరికరాలను ఏర్పాటు చేశారు. డయాగ్నోస్టిక్ హబ్లో 57 రకాల ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయనున్నారు.
వైద్యకళాశాల ఏర్పాటుకు స్థలం పరిశీలన
సీఎం కేసీఆర్ ఇటీవల సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాలను ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ సంగారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో సంగారెడ్డిలో 150 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి హరీశ్రావు బుధవారం మెడికల్ కాలేజీ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష జరుపనున్నారు. అదేవిధంగా వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను పరిశీలించనున్నారు.