సంగారెడ్డి మున్సిపాలిటీ, ఏప్రిల్ 7: జిల్లాలో కరోనా (కొవిడ్-19) కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లు వాడాలని డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి అన్నారు. బయటికి వెళ్లినప్పుడు గుంపులుగా ఉన్న ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించాలని, పండుగలు, పార్టీలకు దూరంగా ఉండాలని, జిల్లాలో ఇప్పటి వరకు వేల మంది కొవిడ్ వాక్సిన్ వేయించుకున్నారని ఆమె చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ తప్పకుండా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని, కరోనా (కొవిడ్-19) వ్యాప్తి, వాక్సిన్పై డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
నమస్తే తెలంగాణ : జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ లక్ష్యం ఎంత? ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు?
డీఎంహెచ్వో : జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ లక్ష్యం 3,35, 726, ఇప్పటి వరకు 41,434 మందికి వ్యాక్సిన్ అందించాం.
నమస్తే తెలంగాణ : జిల్లాలో కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ చేసే కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?
డీఎంహెచ్వో : జిల్లాలో జిల్లా దవాఖానతో పాటు 29 పీహెచ్సీలు, 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక సీహెచ్సీ, రెండు యూపీహెచ్సీలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ అందిస్తారు. జిల్లాలో 7 పైవేట్ దవాఖానల్లో కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. టీఆర్ఆర్, ఎంఎన్ఆర్, మహేశ్వర మెడికల్ కళాశాల, సంగారెడ్డి గోకుల్ దవాఖాన, కంది బాలాజీ దవాఖాన, బీరంగూడ పనాసియా, అశోక్నగర్ మెడికవర్ దవాఖానల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు.
నమస్తే తెలంగాణ : జిల్లాలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎక్కడెక్కడ చేస్తున్నారు. ర్యాపిడ్ పరీక్షలు ఎక్కడ చేస్తున్నారు?
డీఎంహెచ్వో : జిల్లాలో జిల్లా దవాఖాన, పటాన్చెరు అర్బన్ హెల్త్ సెంటర్లలో మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో చేస్తారు.
నమస్తే తెలంగాణ : కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ లక్ష్యం పెంచారా?
డీఎంహెచ్వో : జిల్లాలోని పీహెచ్సీల్లో రోజుకు 150 కొవిడ్ పరీక్షలు, 150 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే, సీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లలో 300 కరోనా పరీక్షలు, 300 మందికి వ్యాక్సినేషన్, జిల్లా దవాఖానలో 500 మందికి కరోనా పరీక్షలు, 500 మందికి వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఇంతకు ముందు 150 మందికి బదులు 100కి కొవిడ్ పరీక్షలు, 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యం ఉండేది. ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి.
నమస్తే తెలంగాణ : సెలవు దినాల్లో కూడా కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ చేస్తారా?
డీఎంహెచ్వో : సెలవు దినాల్లో కూడా కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ అందిస్తున్నాం.
నమస్తే తెలంగాణ : జిల్లాలో ఇప్పటివరకు ఎంతమందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు? వాటి వివరాలు ?
డీఎంహెచ్వో : జిల్లాలో ఇప్పటివరకు 2, 54,762 మందికి కరోనా (కొవిడ్-19) పరీక్షలు నిర్వహించాం. ఇందులో 9,140 మందికి పాజిటివ్ అని తేలింది. 8,610 మంది డిశ్చార్జి అయ్యారు. 453 మంది హోంఐసొలేషన్లో చికిత్సలు పొందుతున్నారు.
నమస్తే తెలంగాణ : కొవిడ్ కేసులు పెరుగుతున్నందున జిల్లాలో ఎక్కడెక్కడ ఐసొలేషన్ వార్డులు అందుబాటులో ఉన్నాయి ?
డీఎంహెచ్వో : జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా జిల్లా దవాఖానలో 160 పడకల ఆక్సిజన్తో కూడిన ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశాం. పసల్వాది ఎంఎన్ఆర్ దవాఖానలో 150 జనరల్, 70 ఆక్సిజన్తో కూడిన పడకల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని అన్ని ఏరియా దవాఖానల్లో 70 పడకల ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశాం. జిల్లా దవాఖానలో 14 వెంటిలేషన్తో కూడిన పడకలను అందుబాటులో ఉంచాం. వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాం.
నమస్తే తెలంగాణ : కొవిడ్ పరీక్షలకు వచ్చే వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు ?
డీఎంహెచ్వో : కొవిడ్ పరీక్షలకు వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి హోంఐసొలేషన్ జాగ్రత్తలను తెలుపుతున్నాం.
నమస్తే తెలంగాణ : కొవిడ్ ప్రబలుతున్నందున ప్రజలకు మీరు చేసే సూచనలు ఏంటి ?
డీఎంహెచ్వో : కొవిడ్ విజృంభిస్తున్నందున ప్రజలు మాస్క్లు తప్పనిసరిగా వేసుకోవాలి. శానిటైజేషన్ చేసుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు, వేరొకరితో మాట్లాడుతున్నప్పుడు భౌతిక దూరం పాటించాలి. శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిది. పండుగలు ఎవరి ఇంట్లో వారు చేసుకోవాలి.
నమస్తే తెలంగాణ : కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
డీఎంహెచ్వో : మాస్క్లు ధరించని వారికి జీవో నెంబర్ 69 ప్రకారం రూ.1,000 జరిమానా విధించాలని ఆదేశాలు ఉన్నాయి. జరిమానా విధించేందుకు పోలీసులు, డీపీవో, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ కూడా చదవండీ…
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?
కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత