బీసీసీఐ ఏ ముహుర్తాన ఐపీఎల్-17ను ఆరంభించిందో గానీ ఈ సీజన్లో బ్యాటర్ల వీరవిహారంతో మ్యాచ్ మ్యాచ్కూ పాత రికార్డులు బద్దలవుతున్నాయి. 2008 నుంచి 2022 దాకా ఆర్సీబీ (263)కి తప్ప మరే జట్టుకూ సాధ్యంకాని 250+ స్కోరును 2024లో పలు జట్లు ఇప్పటికే ఏడు సార్లు సాధించాయి. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కూడా సరికొత్త రికార్డులకు వేదికైంది. చారిత్రక ఈడెన్గార్డెన్స్ వేదికగా బౌండరీల జాతరగా సాగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్ మజాను అందించింది. కేకేఆర్ బ్యాటర్లు పూనకం వచ్చినట్టు ఊగిపోయి 262 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపినా పంజాబ్ బాదుడుకు ఇవి సరిపోలేదు. మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసి ఐపీఎల్తో పాటు టీ20 ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదనను విజయవంతంగా ముగించిన ఆ జట్టు రికార్డు పుటల్లోకెక్కింది. కేకేఆర్ తరఫున సాల్ట్, నరైన్ తుఫాను సృష్టిస్తే పంజాబ్ ఓపెనర్ బెయిర్ స్టో సునామీలా విరుచుకుపడగా ఆఖర్లో శశాంక్ అగ్నిపర్వతంలా బద్దలు కావడంతో సంచలన విజయం అందుకుంది.
IPL | కోల్కతా: ఈడెన్ గార్డెన్స్లో పరుగుల సునామీకి ప్రపంచ పొట్టి క్రికెట్లో రికార్డులన్నీ మూగబోయాయి. సొంత ఇలాఖాలో కోల్కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేస్తూ 261 పరుగులు చేసినా.. భారీ ఛేదనను పంజాబ్ 18.4 ఓవర్లోనే పూర్తిచేసి పొట్టి ఫార్మాట్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75, 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టారు. ఛేదనలో పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (48 బంతుల్లో 108 నాటౌట్, 8 ఫోర్లు, 9 సిక్సర్లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ప్రభ్సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మరో 8 బంతులు మిగిలుండగా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. బెయిర్స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ సీజన్లో భీకరమైన ఫామ్లో ఉన్న కోల్కతా ఓపెనర్లు సాల్ట్, నరైన్ మరోసారి ఈడెన్గార్డెన్లో ఎప్పటిలాగే చెలరేగగా బాధితులుగా మారింది మాత్రం పంజాబ్ బౌలర్లు. బంతి బౌలర్ చేతి నుంచి రిలీజ్ అవడమే తరువాయి దాని గమ్యం బౌండరీ లైన్ను ముద్దాడటమో లేదంటే స్టాండ్స్లో ప్రేక్షకుల చేతుల్లోకి పడటమో అన్నంత రేంజ్లో వాళ్ల విధ్వంసం సాగింది. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన వీళ్లిద్దరి బాదుడుతో 8 ఓవర్లకే కేకేఆర్ స్కోరు 100 పరుగుల మైలురాయిని దాటింది. 23 బంతుల్లోనే నరైన్ అర్ధ సెంచరీ పూర్తికాగా 25 బంతుల్లో సాల్ట్ ఫిఫ్టీ ముచ్చట తీర్చుకున్నాడు. ప్రమాదరకంగా మారుతున్న ఈ జోడీని ఎట్టకేలకు రాహుల్ చాహర్ 11వ ఓవర్లో విడదీయడంతో 138 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కరన్ 13వ ఓవర్లో సాల్ట్ను బౌల్డ్ చేసినా కోల్కతా పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు. వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39, 3 ఫోర్లు), ఆండ్రీ రస్సెల్ (12 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (10 బంతుల్లో 28, 1 ఫోర్, 3 సిక్సర్లు) దొరికిన బంతిని దొరికినట్టుగా బాదడంతో కేకేఆర్ ఈ సీజన్లో రెండోసారి 250 ప్లస్ స్కోరు సాధించింది.
రికార్డు ఛేదన చూసి పంజాబ్ బెదరలేదు. తామేమైనా తక్కువ తిన్నామా అన్నట్టుగా కింగ్స్ ఓపెనర్లు శివాలెత్తారు. పవర్ ప్లేలో ప్రభ్సిమ్రన్ కోల్కతా బౌలర్లను ఊచకోత కోస్తే అతడి తర్వాత వంతు బెయిర్ స్టోది. హర్షిత్ రాణా 2వ ఓవర్లో రెండు సిక్సర్లతో మొదలైన ప్రభ్సిమ్రన్ మెరుపులు.. చమీర 3వ ఓవర్లో 6, 4, 6, 4తో పతాకస్థాయికి చేరాయి. 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకున్న అతడు బెయిర్ స్టో అనవసర పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టో బాదుడు బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. చక్రవర్తి 9వ ఓవర్లో వన్ హ్యాండెడ్ సిక్సర్తో 23 బంతుల్లోనే 50 రన్స్ పూర్తిచేసిన బెయిర్ స్టో ఆ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. చక్రవర్తి, రస్సెల్ను లక్ష్యంగా దాడికి దిగాడు. రస్సెల్ 12వ ఓవర్లో 3 సిక్సర్లతో సెంచరీకి చేరువయ్యాడు. రూసో (16 బంతుల్లో 26, 1 ఫోర్, 2 సిక్సర్లు) రెండో వికెట్కు 38 బంతుల్లోనే 85 పరుగులు జోడించాడు. ఈ జోడీని నరైన్ విడదీసినా శశాంక్ సింగ్తో కలిసి పంజాబ్ స్కోరును 15 ఓవర్లకే 200 మార్కును దాటించాడు. 45 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాక బెయిర్ స్టో కాస్త తగ్గాడు. కానీ మరో ఎండ్లో శశాంక్.. సిక్సర్ల హోరుతో ఈడెన్ను ముంచెత్తడంతో 262 పరుగుల లక్ష్యం మూగబోయింది.
42 టీ20 క్రికెట్లోనే అత్యధిక సిక్సర్లు (42) నమోదైన మ్యాచ్ ఇదే. ఇంతకు ముందు హైదరాబాద్, ముంబై మధ్య ఈ సీజన్లోనే ఉప్పల్ వేదికగా ముగిసిన మ్యాచ్లో 38 సిక్సర్లు నమోదయ్యాయి.
523 ఇరు జట్లూ చేసిన పరుగులు. ఐపీఎల్లో ఇది మూడో అత్యధికం. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఇరు జట్లూ 549 పరుగులు చేశాయి. ఈ రెండు సందర్భాలలోనూ నాలుగు జట్లూ 250+ స్కోర్లు చేశాయి.
264 ఐపీఎల్తో పాటు టీ20 క్రికెట్లో ఇదే అత్యుత్తమ ఛేదన. అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా.. వెస్టిండీస్పై 259 పరుగులను ఛేదించింది. ఐపీఎల్లో రాజస్థాన్.. పంజాబ్పై 224(2020 సీజన్) స్కోరును ఊదేసింది.
4 ఈ మ్యాచ్లో నలుగురు ఓపెనర్లూ (సాల్ట్, నరైన్, ప్రభ్సిమ్రన్, బెయిర్ స్టో) అర్ధ శతకాలు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం.
37 ఫోర్లు
42 సిక్స్లు
సంక్షిప్త స్కోర్లు
కోల్కతా: 20 ఓవర్లలో 261/6 (సాల్ట్ 75, నరైన్ 71, అర్ష్దీప్ 2/45, చాహర్ 1/33).
పంజాబ్: 18.4 ఓవర్లలో 262/2 (బెయిర్ స్టో 108 నాటౌట్, శశాంక్ 68 నాటౌట్, నరైన్ 1/24)