రంగారెడ్డి, ఏప్రిల్ 9, (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల సభ్యులను పూర్తిగా డిజిటలైజేషన్ వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతీది ఆన్లైన్ కావడంతో ఎస్హెచ్జీల నిర్వహణను కూడా ఆన్లైన్ చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో పుస్తకాల్లో రాసే విధానానికి పూర్తిగా ఫుల్స్టాప్ పడనున్నది. ఇక నుంచి మహిళా సంఘాల ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను రూపొందించింది. ముందుగా యాప్ నిర్వహణ కోసం రంగారెడ్డి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. జిల్లాలోని మెజార్టీ భాగం పట్టణ ప్రాంతం కావడం.. ఫోన్ల వాడకంపై మహిళలకు అవగాహన ఉండడంతో జిల్లాను ఎంచుకున్నారు. అయితే ఇప్పటికే మహిళా సంఘాలకు అందజేసిన ట్యాబ్లు పనిచేయనట్లయితే స్మార్ట్ ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేసి సంఘాల నిర్వహణను కొనసాగించనున్నారు. జిల్లాలో మొత్తం 19,500 స్వయం సహాయక సంఘాలుండగా, 2,19,340 మంది సభ్యులున్నారు.
11 మండలాల్లో అమలు…
జిల్లాలో మొదటగా 11 మండలాల్లో యాప్ను అందుబాటులోకి తెచ్చారు. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్, ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ఈ నెల 1 నుంచి యాప్ను వినియోగిస్తున్నారు. అయితే ప్రత్యేక యాప్ నిర్వహణకు సంబంధించి ఆయా మండలాల్లోని వీవోఏలు, సీసీలకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రస్తుతం మహిళా సంఘాల వివరాలను యాప్లో పొందుపరుస్తున్నారు. సంఘాల యొక్క సమావేశాలు, తీర్మానాలు, అంతర్గత అప్పులు, బ్యాంకు, స్త్రీనిధి రుణాలు, ఎన్ఆర్ఎల్ఎం నిధుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో పొందుపర్చనున్నారు. స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల నిర్వహణ అంతా ఆన్లైన్లోనే జరుగనున్నది.
అంతేకాకుండా మహిళా సంఘాలు ఎప్పుడు రుణం తీసుకున్నారు.. ఎవరెవరు ఎంత మొత్తంలో తీసుకున్నారు.. ఏ వ్యాపారం చేస్తున్నారు.. ఎంత తిరిగి చెల్లించారు తదితర వివరాలను ఫొటోలతోసహా యాప్లో నిక్షిప్తం చేయనున్నారు. మహిళా సంఘాలు ప్రత్యేక యాప్ను నిర్వహించేందుకుగాను ప్రతీ మహిళా సంఘానికి యూజర్ ఐడీతోపాటు పాస్వర్డ్ను అందించనున్నారు. సంఘాల్లోని సభ్యులకు యాప్ నిర్వహణ తెలియనట్లయితే ప్రత్యేకంగా ఒకరిని నియమించుకొని నిర్వహించుకోవచ్చు. ఇక నుంచి మహిళా సంఘాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సమాచారం జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారితోపాటు సెర్ప్ సీఈవోకు కూడా తెలియనున్నది. అయితే సెర్ప్ సీఈవో, డీఆర్డీవో, డీపీఎం, ఏపీఎం, సీసీలకు కూడా ప్రత్యేక యాజర్ ఐడీ, పాస్వర్డ్లను కేటాయించనున్నారు. కొత్తగా 2752 ఎస్హెచ్జీలు ఏర్పాటు చేయగా.. 29,450 మంది సభ్యులున్నారు.
ఇవీ కూడా చదవండి…
ప్రైవేటు టీచర్ల బాంధవుడు సీఎం కేసీఆర్
‘గొర్ల కాపరుల’ఎన్నికలకు సిద్ధం కావాలి