MLA Harish Rao | మెదక్ : మెదక్ను అభివృద్ధి చేసిన కేసీఆర్ను రేవంత్ రెడ్డి నానా మాటలు అంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కేసీఆర్ను అవమానిస్తే మెదక్ను అవమానించినట్లే. ఈ ఎన్నికల్లో రేవంత్కు ఓటుతో బుద్ధి చెప్పాలి అని హరీశ్రావు సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
దేశాన్ని పదేండ్లు పాలించిన బీజేపే ప్రజలకు ఏం మేలు చేసిందో చెప్పట్లేదు. 5 నెలల తన పాలనలో ఏం జరిగిందో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం లేదు. తెలంగాణ ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు సహకరించిన బీజేపీకి కూడా గుణపాఠం నేర్పాలి. రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని చెప్పాడు. అవి అమలవుతున్న గ్రామాల్లోనే కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడగండి. అమలుకాని చోట ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయండి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తప్పుడు హామీ ఇచ్చినందకు కాంగ్రెస్ అధిష్టానం క్షమాపణ చెప్పాలి. వంద రోజుల్లో అమలు చేస్తామంటూ కాంగ్రెస్ రాసిచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని హరీశ్రావు తెలిపారు.
మెదక్ జిల్లా ముద్దుబిడ్డ కేసీఆర్ ఉద్యమాన్ని మెదక్ నుండే ప్రారంభించారు. రాష్ట్రమంతా ఉద్యమం చేపట్టారు. ఓటుతో కాంగ్రెస్, బీజేపీలకు మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారు. బీజేపీ 10 సంవత్సరాల పాలనలో ఆదానీ, అంబానీలకు మేలు చేసింది తప్ప పేదవాడికి చేసిందేమీ లేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసింది కేసీఆర్. కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనం పోగొట్టుకోవడమే. ఉన్న జిల్లాలను పోగొట్టడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. మెదక్ బీజేపీ అభ్యర్థి గిమ్మిక్కులు, ఫేక్ వీడియోలతో ప్రచారం చేయబోతున్నాడు. ఫేక్ వీడియోలు, సోషల్ మీడియాలో బోగస్ ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు. తప్పుడు వార్తలపై, బోగస్ సోషల్ మీడియా ప్రచారాలపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. మెదక్ ప్రజలు నిజాలను గ్రహించి ఓటు వేయాలి అని హరీశ్రావు కోరారు.