Independence Day : దేశం ఒకపక్క స్వాతంత్య్ర దిన వేడుకలకు సిద్దమవుతుంటే.. మరోపక్క దేశ రాజధానికి మాత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఎయిర్పోర్టు, ఎర్రకోట, హైకోర్ట్ సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి శుక్రవారం అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది. దీనిలో ఢిల్లీలోని కోర్టులు, రైళ్లలో పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరించారు. ఆగష్టు 15న ఈ పేలుళ్లు జరుపుతామని మెయిల్లో ఉంది. అందులోనూ ఢిల్లీ హైకోర్టును ఆగష్టు 15న మధ్యాహ్నం 2.11 గంటలకు పేల్చేస్తామని కూడా పేర్కొన్నారు.
ఢిల్లీని ఖలిస్తాన్లో భాగంగా చేయాలనే లక్ష్యంతో ఈ పేలుళ్లు జరుపుతామని మెయిల్లో పేర్కొన్నారు. సిక్కులకు న్యాయం చేయడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైనట్లు, అందులోనూ 1984లో జరిగిన సిక్కు అల్లర్ల కేసులో బాధిత సిక్కులకు కోర్టు న్యాయం చేయలేకపోయిందని, అందుకే ఢిల్లీ హైకోర్టును టార్గెట్ చేశామని మెయిల్లో వివరించారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3ని పేల్చేస్తామన్నారు. జామ్నగర్ హౌజ్, ఝండేవాలన్ బిల్డింగ్ వంటివాటికి కూడా బాంబు ముప్పు ఉంది. ఈ బాంబు హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. బాంబు బెదిరింపులు ఉన్న ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గట్టి నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లలో తనిఖీలు చేపడుతున్నారు.
ఇతర పబ్లిక్ ప్లేసులలో కూడా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ హైకోర్టు, ఎయిర్పోర్టులలో భద్రతను మరింతకట్టుదిట్టం చేశారు. శనివారం, ఆగష్టు 15న ఢిల్లీలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకల కోసం ఢిల్లీ నగరంలోని ఎర్రకోట ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వేడుకల కోసం మండి హౌజ్ మెట్రో స్టేషన్, ఐటీవో బిల్డింగులను అందంగా అలంకరించారు.