బెంగళూరు: కొందరు వ్యక్తులు ఒక మహిళను కొట్టి చంపారు. ఏడుస్తున్న కుమార్తె అయిన ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని ఆమె మృతదేహంపై ఉంచి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళ భర్త, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (Woman Beaten To Death) కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింధనూర్ సబ్ డివిజన్లోని ఆర్హెచ్ క్యాంప్ ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల స్నేహపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రాయితో ఆమె తలపై కొట్టి చంపారు. ఏడుస్తున్న ఏడాదిన్నర వయస్సున స్నేహ కుమార్తెను ఆమె మృతదేహంపై ఉంచి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, గ్రామం శివార్లలోని పొలంలో స్నేహ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుమార్తె అయిన చిన్నారి చనిపోయిన తన తల్లిని గట్టిగా పట్టుకుని నిస్సహాయంగా ఏడుస్తూ కనిపించింది. ఇది చూసి పోలీసులు, స్థానికులు చలించిపోయారు. ఆ మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు నాలుగేళ్ల కిందట అమిత్తో స్నేహకు వివాహం జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. గత నాలుగు నెలలుగా శుభమ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో స్నేహ భర్త, ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను హత్య చేసిన వ్యక్తులు, అందుకు కారణాలు తెలుసుకునేందుకు వారిద్దరిని ప్రశ్నిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.