ముంబై: పీపీఈ కిట్ ధరించిన దొంగలు ప్రైవేట్ బ్యాంకు లాకర్ను పగులగొట్టారు. (Bank Locker Broke) అందులో ఉంచిన సుమారు ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగలు చోరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు షాక్ కాగా, కస్టమర్లు లబోదిబోమంటున్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 4న అర్ధరాత్రి వేళ రద్దీ ప్రాంతంలో ఉన్న ఐసీఐసీ హోమ్ ఫైనాన్స్ బ్రాంచ్లోకి దొంగలు ప్రవేశించారు. అక్కడి లాకర్ను పగులగొట్టారు. అందులో ఉన్న సుమారు 4.93 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఒక దొంగ పీపీఈ కిట్ ధరించగా మరో ఇద్దరు తమ ముఖాలకు ముసుగులు వేసుకున్నారు.
కాగా, శనివారం లాకర్లో కస్టమర్ నగలు ఉంచే క్రమంలో ఈ చోరి విషయాన్ని బ్యాంకు సిబ్బంది గ్రహించారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ లాకర్లో 222 మంది కస్టమర్లకు చెందిన సుమారు 1.34 కేజీల బంగారు ఆభరణాలు, నగలు ఉన్నట్లు తెలుస్తున్నది. సుమారు ఐదు కోట్ల విలువైన వీటిని దొంగలు చోరీ చేశారన్న విషయం తెలుసుకున్న కస్టమర్లు లబోదిబోమంటున్నారు. తమ నగలు, బంగారు ఆభరణాల కోసం బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు.