హనుమకొండ, ఆగస్టు 7 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 10తో ఈ ప్రక్రియ గడువు ముగియనుంది. ఇప్పటికే ఈ గడువును రెండుసార్లు పొడిగించగా, ఇప్పుడు మరోసారి పెంచే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. గడువు దగ్గరపడగా, ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకున్న కొద్ది మంది ఓటర్లు తిరిగి ఇవ్వకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ఈఎఫ్లు అందించని ఓటర్ల కోసం బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ తిరుగుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజక వర్గాల పరిధిలో వివిధ కారణాలతో భారీగా ఓట్లు తొలగింపునకు గురికానున్నట్లు తెలిసింది.
100 శాతం లక్ష్యంగా..
ఉమ్మడి జిల్లాలో వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో సర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో ఓటు హక్కును కలిగి ఉన్న చిరునామాలో ప్రస్తుతం ఓటర్లు లేకపోవడంతో వారి కోసం బీఎల్వోలు, బీఎల్ఏలు ఆరా తీస్తున్నారు. అలాగే కొందరు ఓటర్లు ఓట్లున్న ప్రాంతాల్లో ఇంకా ఫామ్స్ అందజేస్తున్నట్లు తెలుస్తున్నదని, దీంతో డబుల్ ఓటర్లుగా నమోదవుతున్నట్లు అనుమానం వస్తున్నదని అధికారులు అంటున్నారు. డబుల్ ఓట్లు ఉంటే జైలు శిక్షేనని ప్రచారం చేసినప్పటికీ సైతం కొందరు నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నదని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
తగ్గనున్న ఓటర్లు..
ఓటర్ల జాబితా ప్రక్షాళనతో ఉమ్మడి జిల్లాలో భారీ సంఖ్యలో ఓటర్లు తగ్గే అవకాశం కనిపిస్తున్నది. బీఎల్వోల క్షేత్రస్థాయి పరిశీలనలో మరణించినవారు, డబుల్ ఓట్లున్న, శాశ్వతంగా వలస పోయిన, అందుబాటులో లేని వారిని అధికారులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాల పరిధిలో మొత్తం 30,53,238 మంది ఓటర్లున్నారు. వీరి నుంచి మరణించిన, శాశ్వతంగా షిప్ట్ అయిన, డబుల్ ఓటర్లు, అందుబాటులో లేనివారు, ఇతరులు కలిపి మొత్తం 3,75,519 మంది ఓట్లు తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
అయితే గడువు ముగిసే వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. కాగా అత్యధిక ప్రభావం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (80,335 మంది)పై పడింది. ఒకే నియోజకవర్గంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపునకు రావడం రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకుంటుండడంతో అన్ని పార్టీలు ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సా రించాయి. తమ కార్యకర్తల ద్వారా ఓటర్ల వివరాలు పరిశీలించి, అర్హుల పేర్లు తొలగిపోకుండా చర్యలు చేపడుతున్నాయి. ముసాయిదా జాబి తా విడుదల తర్వాత జిల్లా లో ఓటర్ల సంఖ్యలో ఎంత మేర మార్పు వస్తుందనే అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
