సిటీ బ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): నగరంలో పేదలకు పంచగా ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు మిగిలి ఉన్నాయి.. 2024 నుంచి ఇప్పటి దాకా ఏయే ప్రాంతాల్లో ఎన్ని పంపిణీ చేశారు.. అనే ప్రశ్నలకు జిల్లా గృహ నిర్మాణ కార్పొరేషన్ అధికారుల దగ్గర సమాధానం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్ల వివరాలను బయటకు చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన ఇండ్ల వివరాలు చెప్పేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు.. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది.. డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది పేదలకు పంచేందుకే కదా.. ప్రజలకు తెలియకుండా ఇండ్లను అనర్హులకు కట్టబెడుతున్నారా.. లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు అమ్ముకుంటున్నారా.. అధికారుల తీరును చూస్తుంటే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇప్పటికే నగరంలో డబుల్ బెడ్ ఇండ్లను ఇష్టారీతిన అనర్హులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారుల సిఫార్సులతో కేటాయిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ని ఇండ్లు మిగిలి ఉన్నాయో వివరాలు బయటకు చెప్పకపోవడంతో వాటిని కూడా అమ్ముకుంటున్నారా? అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తున్నది. ఇదే విషయమై హౌసింగ్ అధికారులను వివరాలు అడగగా ‘చెప్పలేం’ అని తేల్చేస్తున్నారు. ఉన్నతాధికారులు వివరాలు ఇవ్వొద్దంటున్నారు.. తామేమీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. 2024 నుంచి ఇప్పటిదాకా 3,980 ఇండ్లను పంపిణీ చేశామని.. ఎన్ని మిగిలి ఉన్నాయో మాత్రం చెప్పలేమని చేతులు దులుపుకొంటున్నారు.
అధికారులు, కాంగ్రెస్ నేతల కుమ్మక్కు
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్కు నలువైపులా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అప్పటికే 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిలో సగం వరకు ఇండ్లను అర్హులైన నిరుపేదలకు లాటరీ విధానంలో పంపిణీ చేశారు. మిగిలిన 10 శాతం నిర్మాణం ప్రభుత్వం మారాక పూర్తయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావొస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ తీవ్ర జాప్యం చేసింది. ఆ తర్వాత మూసీ సుందరీకరణ పేరిట బస్తీల్లోని ఇండ్లను కూల్చి కొంతమంది అర్హులకు ఆయా ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. అప్పటి నుంచే డబుల్ బెడ్రూం ఇండ్ల దందాకు తెరతీశారు.
ఇండ్లను పేదలకు పంచుతున్నామని చెప్పుకొంటూ ఇష్టానుసారంగా అనర్హులకు పంచిపెడుతున్నారు. స్థానికేతరులు, అనర్హులకు అమ్ముకుంటున్నారు. నగరంలోని బస్తీల పేదలను పక్కన పెట్టి ఇతర జిల్లాల్లోని అనర్హులకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలదాకా విక్రయిస్తున్నట్లు అసలైన అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చి కొన్నవారు బహిరంగంగానే చెబుతున్నారు. ఏకంగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారుల సిఫార్సులతో విచ్చలవిడిగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయో చెప్పేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల దందాకు హౌసింగ్, రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తూ దందాకు పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండ్ల వివరాలు ఇచ్చేందుకు వెనకాడుతున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు అధికారులు అండగా ఉంటూ దందాను విజయవంతంగా సాగేలా కృషిచేస్తున్నారు.