BRS leaders | కుత్బుల్లాపూర్, జూన్ 21 : హైడ్రా బూచి పేరు చెప్పుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బ్లాక్ మెయిలర్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కొలన్ హన్మంత్ రెడ్డికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను విమర్శించే నైతిక హక్కు లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ శ్రేణులు హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్పై కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. శనివారం చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు కేపీ వివేకానంద్ను విమర్శించే స్థాయి నీది కాదన్నారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా చేసే నీచ రాజకీయాలకు తెరలేపుతూ.. బిల్డర్లను, నిర్మాణదారులను ముప్పుతిప్పలు పెడుతున్న తీరుపై త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఓడిపోయి స్థానికంగా ఉండకుండా జూబ్లీహిల్స్లో ఉంటూ హన్మంత్ రెడ్డి నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై ప్రజాభివృద్ధిపై పనిచేసే ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను విమర్శించడం విడ్డూరమైన చర్య అన్నారు.
మొన్నటి ఎన్నికల్లో నీవు మూడవ స్థానానికి పడిపోయినా ఇంకా బుద్ధి రాలేదని. ప్రజలెంత చీదరించుకున్నా నీకు బుద్ధి రాదనీ.. ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని హితవు పలికారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ పాలనలో హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతూ నీవు చేసే వసూళ్లపై నిజాంపేట్లో ఏ బిల్డర్ను అడిగినా చెబుతారని, బాచుపల్లి సాయి నగర్లో దొంగ పట్టాలు తయారు చేసి అమ్మితే టీడీపీ నుంచి వెలివేసిన సంఘటన వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.
నియోజకవర్గం నుండి బ్యాగులు మోస్తున్నారా..?
బాచుపల్లి, మల్లంపేట్, భౌరంపేటలలోని చెరువులు, నాలాలపై నీవు చేసిన ఆక్రమణలపై జైలుకు పోవాల్సింది నీవే అన్నారు. గత పదేళ్లలో ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ లో ఉండి తర్వాత అమ్ముడుపోయిన నీవు అప్పుడు నిద్ర పోయినావా…? ఇప్పుడు చెరువులు, కుంటలు అనుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నావని ప్రశ్నించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే బిఆర్ఎస్ పార్టీ.. ఒకసారి జడ్పిటిసిగా, మరొకసారి ఎమ్మెల్యేకి అవకాశం కల్పించి నీకు రాజకీయ భిక్ష పెట్టిందే బిఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు.
యధా రాజా..తథా మంత్రులు, అనుచరులు లాగా.. మీరు కూడా మీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి హైడ్రా పేరుతో నియోజవర్గం నుండి బ్యాగులు మోస్తున్నారా..? అని ఇక్కడి ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. హన్మంత్ రెడ్డి ఇకనైన మా నాయకులు, ఎమ్మెల్యే వివేకానంద్ పై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకో, లేదంటే రాజకీయంగా నిన్ను తిరస్కరించిన కుత్బుల్లాపూర్ ప్రజలు, మున్ముందు రాజకీయ భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు కస్తూరి బాలరాజు, నియోజకవర్గ పార్టీ యువత అధ్యక్షులు దుధిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, ఏరవ శంకరయ్య, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, వేణు యాదవ్, కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్, యేసు, నదీమ్ రాయ్, ఆటో బలరాం, నార్లకంటి శ్యాం, నార్లకంటి కుమార్, కుంట వేణు, తెలంగాణ సాయి, గణేష్, బాల మల్లేష్, శ్రీకాంత్, సాజిద్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్