నిర్మల్ : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తున్నది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 6 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టులోకి 77,442 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 6 వరద గేట్లు 10 ఫీట్లు గేట్లు ఎత్తి అవుట్ ప్లోగా 67, 000 క్యూసెక్కుల నీటిని దిగవనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు.
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 693.725 అడుగులు 2.212 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు కోరారు.