నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్నరెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఏడుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు.అతివేగమే ప్రమాదానికి కారణంగా కావచ్చని భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
అచ్చంపేట పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేసి సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. తక్షణమే క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించి వైద్య సేవలందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఈ రెండు రంగాల్లో దేశంలోనే తెలంగాణ క్రియాశీల రాష్ట్రంగా ఆవిర్భవించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్కృష్ణలో టాటా బోయింగ్ 100వ అపాచీ ప్యూజ్లేజ్ డెలివరీ వేడుకలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
బీజేపీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేశానని ప్రకటించారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళితులందరూ కేసీఆర్కు అండగా నిలబడి హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
భారత సంతతికి చెందిన ఇంజినీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రినా కురణి.. అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా జిల్లా నుంచి ఆమె హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పోటీ చేయనున్నది. రివర్సైడ్లో ఉన్న భారతీయ ఇమ్మిగ్రాంట్ పేరెంట్స్కు కురణి జన్మించింది. 2022 నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ నేత కెన్ కాల్వర్ట్పై ఆమె పోటీ చేయనున్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. శుక్రవారం అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 163 పైకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.
గోదావరి వరద నీరు హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే జాతీయ రహదారి పైకి వాజేడు మండలంలోని పావురాల వాగు బ్రిడ్జి పైకి చేరడంతో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి మద్దతుగా వరంగల్లోని గ్రౌండ్లో కేటీఆర్ రూపాన్ని వంద అడుగుల్లో గ్రీన్ ఆర్ట్ రూపొందించారు. ఇక కేటీఆర్కు మెగాస్టార్ చిరంజీవి ఒక రోజు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.
జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటో ఈ గేమ్స్ను ప్రారంభించారు. ప్రతిసారి ఎంతో అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను కరోనా కారణంగా ఈ సారి ప్రేక్షకులు లేకుండానే సింపుల్గా నిర్వహించారు. టీమ్స్ పరేడ్లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యను కూడా ఈసారి పరిమితం చేశారు. ఇండియా తరఫున కేవలం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్లో ఆడబోయే క్రీడాకారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల ఆట ప్రారంభమయ్యింది. తొలిరోజు ఆర్చరీ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్ రౌండ్ పూర్తయింది. ఇందులో భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ర్యాకింగ్స్లో 72 బాణాలు సంధించిన దీపికా.. మొత్తం 663 స్కోరు సాధించింది. తొలి మూడు స్థానాల్లో దక్షిణ కొరియా ఆర్చర్లు నిలిచారు.