నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కార్లు ఎదురెదురుగా ఢీకొని ఏడుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద ధాటికి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా కావచ్చని భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.