రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ హుజురాబాద్ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని, కౌశిక్రెడ్డి భవిష్యత్కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నట్లు తెలిపారు. మలిదశ ఉద్యమంలో కౌశిక్రెడ్డి తండ్రి సాయినాథ్రెడ్డి తనతో భుజం కలిపి పనిచేసినట్లుగా సీఎం చెప్పారు.
తెలంగాణ పునర్నిర్మాణం ఒక ట్రాక్ ఎక్కిందని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే ఈ క్రమంలో విమర్శలకు భయపడి తమ ప్రస్థానాన్ని ఆపమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై విమర్శలను తిప్పికొట్టారు. దళితబంధు కోసం హుజూరాబాద్నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని చెప్పారు. గతంలో రైతుబంధు, మొదటి సింహగర్జన కూడా హుజూరాబాద్లోనే ప్రారంభించినట్లు గుర్తు చేశారు. రైతుబీమా కూడా కరీంనగర్లోనే ప్రారంభించినట్లు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, పీ జానయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
బ్యాడ్మింటన్, షూటింగ్ క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లు అని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హెచ్సీయూలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్, గగన్ నారంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ నుంచి ఐదుగురు ఒలిపింక్స్కు వెళ్లడం గొప్ప విషయం అన్నారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
టీఎస్ ఎంసెట్, బిట్ శాట్ ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఒకే సమయంలో నిర్వహించనున్నారు. దీంతో బిట్శాట్ రాసే విద్యార్థులు ఎంసెట్ పరీక్షల తేదీని మార్చుకునేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. రెండు పరీక్షలు రాసే విద్యార్థులు ఎంసెట్ కన్వీనర్కు convener.eamcet@tsche.ac.in మెయిల్ ఐడీ ద్వారా విజ్ఞప్తి చేసుకోవచ్చు.
టీటీడీలోని ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 నుంచి అమ్మకాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అమ్మకాలు ప్రారంభించాలన్నారు.
బర్డ్ఫ్లూ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాల్సిన అవసరం ఉందని, నమూనాలు సైతం తీసుకోవాలన్నారు. వైరస్తో హర్యానాకు చెందిన 11 ఏండ్ల బాలుడు మృతి చెందిన ప్రాంతంలో ఫౌల్ట్రీల్లో మరణాలపై ఆరా తీయాలన్నారు.
2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ జరిగాయి. మళ్లీ 32 ఏళ్లకు ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ క్రీడలు జరగబోతున్నాయి. కాగా, టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరుహిటో హాజరు కానున్నారు.
ఓ భారీ ఆస్టరాయిడ్ భూమి వైపు మెరుపు వేగంతో దూసుకొస్తోంది. ఇది ఈ నెల 24న భూమిని దాటి వెళ్లిపోనున్నట్లు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వెల్లడించింది. ఈ ఆస్టరాయిడ్ను 2008 గో20గా పిలుస్తున్నారు. ఇది ఓ స్టేడియం పరిమాణం లేదా తాజ్మహల్ కంటే మూడు రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. గంటలకు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెకను 8 కిలోమీటర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్నట్లు నాసా చెప్పింది.