హైదరాబాద్ : రాష్ర్టాభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కౌశిక్రెడ్డి భవిష్యత్కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నట్లు సీఎం తెలిపారు. హుజురాబాద్ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి బుధవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అభ్యుదయాన్ని కాంక్షించి,అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్లోకి వచ్చిన మిత్రులందరికీ స్వాగతం అన్నారు. మలిదశ ఉద్యమంలో కౌశిక్రెడ్డి తండ్రి సాయినాథ్రెడ్డి తనతోని భుజం కలిపి పనిచేసినట్లుగా సీఎం చెప్పారు.
ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించాం. ప్రొ.జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపాం. రాష్ర్టాన్ని సాధించాం. రాష్ట్రం వచ్చినప్పుడు ఒక విపత్కర పరిస్థితి. కరెంట్ కోతలు, తాగేందుకు మంచినీళ్లు లేవు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో సమస్యలు. అవగాహనతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ వస్తున్నం. ఒక్కో పథకం రూపకల్పన వెనుక ఎంతో మేథో మధనం ఉంది. తెలంగాణ ప్రజలు గర్వంగా బతకాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
ఎవరు ఎంత మొత్తుకున్నా తెలంగాణలో ఇకపై కరెంట్ పోదన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నట్లు తెలిపారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నారు. గొర్రెల పంపిణీ అంటే పప్పు, బెల్లం లాంటి పథకం కాదన్నారు. ఇవాళ తెలంగాణ రైతులు 3 కోట్ల టన్నుల వడ్లు పండించారు. 90 లక్షల టన్నుల వడ్లు ఎఫ్సీఐకి ఇచ్చినట్లు చెప్పారు. రైతుబంధుపై కొందరు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఆగిపోయినట్లు సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం, గెలవడం నిరంతర ప్రక్రియ అన్నారు. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరన్నారు. ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఫలితాలు ప్రజల కళ్లముందున్నట్లు సీఎం పేర్కొన్నారు.