కొనుగోళ్లపై దృష్టి సారించిన యంత్రాంగం
గతంలో రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది. ఈసారి ఆ అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు ఈ ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సర్వే చేపట్టారు. గ్రామ యునిట్గా వరి సాగు వివరాలను సేకరించారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మార్కెటింగ్శాఖ అధికారులు జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైస్ మిల్లర్ల ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, సత్తుపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూర్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. వరి సాగు ఎక్కువగా సత్తుపల్లి, వైరా డివిజన్లలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.
రికార్డు స్థాయిలో వరి సాగు..
జిల్లావ్యాప్తంగా రైతుల సంఖ్య 1,14,918 ఉండగా యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 3,20,672 ఎకరాల్లో పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రైతులు వారి అంచనా కంటే అధికంగా 3,37,438 ఎకరాల్లో సాగు చేపట్టారు. దీంతో సాగు 105.2 శాతంగా నమోదైంది. జిల్లాలో వరి 2,07,569 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా 2,26,532 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ సారి 91శాతం మంది లావు రకం (ఎంటీయూ-1010), తొమ్మిది శాతం సన్నాల రకాలను పండిస్తున్నారు. ఈ సారి 5,88,982 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇతర పంటల వివరాలు..
జొన్న 1,255 ఎకరాలు, మక్కలు 80,549, పెసర 14,898, కంది 143, మినుములు తొమ్మిది, వేరుశనగ 4,088, జనుము 1,608, ఆయిల్పాం 5,888, చెరుకు 4,348 ఎకరాల్లో సాగువుతున్నది. ఇతర పంటలు మరో 4,805 ఎకరాల్లో సాగవుతున్నాయి. ఉద్యానశాఖ పరిధిలో పచ్చి మిర్చి 2,179 ఎకరాలు, నిమ్మ 1,807 ఎకరాలు, సుబాబుల్ 27,850 ఎకరాలు, కూరగాయల సాగు 1,984 ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇతర ఉద్యాన పంటలను రైతులు మరో 4,886 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
మంచి దిగుబడి వచ్చే అవకాశం..
యాసంగిలో జిల్లావ్యాప్తంగా ఆశించిన మేరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది పంటలకు సమృద్ధిగా సాగునీరు అందింది. చీడపీడల బెడద కూడా లేదు. ఎకరానికి 26 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. వానకాలంలో రైతులు సన్నాలు ఎక్కువగా సాగు చేసేవారు. ఈసారి 91శాతం మంది లావు రకం (ఎంటీయూ-1010) విత్తనాలనే సాగు చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి..