న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్లు, టీవీలు.. ఎలక్ట్రానిక్ గూడ్స్ మొదలు కార్ల తయారీలో టెక్నాలజీ వినియోగం.. ఫలితంగా వాటిల్లో సెమీ కండక్టర్లు/ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేదంటే చిప్స్ వినియోగం తప్పనిసరవుతున్నది. ఆయా వస్తువుల పనితీరుకు చిప్లు మెదడులా పనిచేస్తాయి. అందుకే ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తుల తయారీలో చిప్లు భారీగా ఉపయోగిస్తుంటాయి.
అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రపంచమంతా చిప్ల కొరత భారీగా పెరిగింది. ప్రజల నుంచి వచ్చే డిమాండ్కు సరిపడా చిప్ల తయారీ, సరఫరా లేక ఎలక్ట్రానిక్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. ఇంటి నుంచే పని చేసేందుకు ఉద్యోగులకు అవకాశం ఇవ్వడంతో ల్యాప్టాప్, పర్సనల్ కంప్యూటర్ల కొనుగోళ్లు పెరిగాయి. అలాగే, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. దీంతో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకు గిరాకీ పెరిగింది.
మరోవైపు టీవీలు, ఏసీలు, అప్డేటెడ్ మొబైళ్లు, గేమింగ్ డివైజ్లు ఇలా రకరకాల వస్తువులను ప్రజలు భారీగా కొనుగోలు చేశారు. లాక్డౌన్ వేళ ప్రజల నుంచి భారీగా కొనుగోళ్లు ఉంటాయని చిప్ తయారీ సంస్థలు ఊహించలేదు. మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆర్డర్లు వస్తుండటంతో కంపెనీలన్నీ వాటిని ఉత్పత్తి చేసేందుకు సిద్ధం అయ్యాయి.. కానీ చిప్ కంపెనీలు డిమాండ్కు తగినట్లు వాటిని సరఫరా చేయలేకపోతున్నాయి.
చిప్లను తయారు చేసే రెండు భారీ కంపెనీలు ఆసియాలోనే ఉన్నాయి. అవి తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫాక్చరింగ్ కో (టీఎస్ఎమ్సీ), శ్యామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కో. ఈ రెండు సంస్థలూ లాక్డౌన్ సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులకు వచ్చే డిమాండ్ను ఊహించలేకపోయాయి.
ఫలితంగా ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో రూ.4.42లక్షల కోట్ల మేరకు వ్యాపారం దెబ్బతినే అవకాశముందని నిపుణులు అంచనా వేశారు. అలాగే లక్షల వాహనాల ఉత్పత్తి ఆలస్యమయ్యే అవకాశముందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత కొరత పెరగడం లేదంటే వస్తువుల ధరలు పెరగడం ఖాయమంటున్నారు.
ప్రస్తుతం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చిప్లను తయారు చేసేందుకు టీఎస్ఎమ్సీ, శాంసంగ్ భారీగా నిధులు వెచ్చించబోతున్నాయి. టీఎస్ఎమ్సీ 2021లో 28 బిలియన్ డాలర్లు.. శ్యామ్సంగ్ వచ్చే పదేండ్లలో 116 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది.
అన్ని రకాల వస్తువులను తయారు చేసే చైనాను గత అమెరికా ప్రభుత్వం చిప్ల తయారీ విషయంలో పలు విధాలుగా అడ్డుకున్నా చైనా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇటీవల చైనాకు చెందిన సెమీకండక్టర్ మ్యానుఫాక్చరింగ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ 2.35 బిలియన్ డాలర్లతో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నది. 2022లో చిప్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది.
చిప్ల కొరతపై సమీక్ష నిర్వహించడంతోపాటు చిప్ల తయారీ సంస్థలను తమ దేశంలో ఏర్పాటు చేయాలని అమెరికా సైతం కోరుతున్నది. ఇప్పటికే టీఎస్ఎంసీ సంస్థ ఆరిజోనాలో ప్లాంట్ ఏర్పాటు చేసేలా 12 బిలియన్ డాలర్లతో ఓ ప్రాతిపాదన తెచ్చింది. అలాగే టెక్సాస్లో శ్యామ్సంగ్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 17 బిలియన్ డాలర్ల పన్ను ప్రోత్సాహకాలిస్తామని అంటున్నది.
టీఎస్ఎంసీ, శ్యామ్సంగ్ సాయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏకంగా యూరప్లో ఒక సెమీకండక్టర్ తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ప్రపంచానికి అవసరమ్యే చిప్లను అందించే శక్తిని సంపాదించుకోవడం కోసం ఆయా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
ధావన్, పంత్, హార్దిక్ మెరుపులు..భారత్ 329 ఆలౌట్
టయోటా కార్లు ప్రియం ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు
ఆదానీ చేతికి కర్నూల్-వరోరా ట్రాన్సిమిషన్!
ఇక మెడికల్, డిజటల్ సహా పలు రంగాల్లోకి టాటా విస్తరణ
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!