న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించడం సబబేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో ఇరు పక్షాలు తమ సంస్థల ప్రగతి విషయంలో ముందుకు వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రత్యేకించి టాటా సన్స్ నూతన రంగాల్లో విస్తరణకు ప్రణాళికలను ఆమోదించేందుకు రంగం సిద్ధం అయ్యింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ)ను టేకోవర్ చేయడంతోపాటు డిజిటల్, మెడికల్ డయాగ్నసిస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు, కొత్త బిజినెస్ల ప్రవేశానికి తుది నిర్ణయం తీసుకోనున్నది టాటా సన్స్. ఇప్పటి వరకు సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్ తమ ప్రణాళికలకు ఆటంకంగా మారిందని టాటా సన్స్ అధికారులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో ప్రతిపాదిత ప్రణాళికలకు టాటా సన్స్ బోర్డు ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు. కీలక ప్రాజెక్టులు త్వరలో కార్యరూపం దాలుస్తాయని ఆశాభావంతో ఉన్నారు. టాటా సన్స్, షాపూర్జీ పర్లోంజీ గ్రూప్ మధ్య వాటాలు, వాటి విలువ ఖరారు అంశాన్ని విడిగా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సైరస్ మిస్త్రీతో వివాదానికి తెర పడటంతో టాటా సన్స్, టాటా ట్రస్టులకు సంబంధిత బోర్డుల్లో సభ్యుల నియామకానికి మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టులో తీర్పు టాటా సన్స్కు అనుకూలంగా వస్తుందని కొందరు న్యాయ నిపుణులు ముందే అంచనా వేశారు.
అయితే, సైరస్ మిస్త్రీ సోదరుల సారథ్యంలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ షేర్ల నుంచి నిధులు సమకూర్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిందని కొందరు న్యాయవాదులు అంటున్నారు. ప్రత్యేకించి ఎస్పీ గ్రూప్కు అత్యంత సన్నిహితుడైన ఓ న్యాయవాది మాట్లాడుతూ తమ గ్రూప్ ఆర్థిక ప్రయోజనాలను సుప్రీంకోర్టు రక్షించిందన్నారు.
టాటా సన్స్లో లిస్టెడ్ సంస్థలు, అన్ లిస్టెడ్ సంస్థలు, స్థిరాస్తుల విలువను బట్టి ఎస్పీ గ్రూప్ షేర్ల విలువ నిర్ణయం అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్పీ గ్రూప్ షేర్ల ప్రతిజ్ఞ ఆధారంగా నిధులు సమకూర్చుకునేందుకు ఆ సంస్థకు అవకాశం ఉందని తెలిపింది.
అయితే, ఎస్పీ గ్రూప్ తన వాటాల విలువ రూ.1.75 లక్షల కోట్ల పై చిలుకు అని వాదిస్తుండగా, టాటా సన్స్ రూ.60 వేల కోట్లు మాత్రమేనని చెబుతున్నది. ఇది భవిష్యత్లో మరో న్యాయ పోరాటానికి దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!